అమెరికాలో తెలుగు వ్యక్తి ఘాతుకం..!
అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. తన భార్యను కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని పేరు శ్రీనివాస్ నకిరేకంటి. వయస్సు 21 సంవత్సరాలు. టెక్సాస్లో ఓ చమురు సంస్థలో ఉద్యోగి. తన భార్య శాంతి, కుమారుడు, కుమార్తెతో కలిసి టెక్సాస్ సమీపంలోని షుగర్ ల్యాండ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. శాంతి నకిరేకంటి కూడా ఉద్యోగిని. స్థానికంగా ఓ సాఫ్ట్వేర్ సంస్థలో కంప్యూటర్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నారు. సోమవారం శ్రీనివాస్ ఇంట్లో నుంచి తుపాకుల శబ్దం వినిపించింది.
దీనితో చుట్టు పక్కలవారు అతని ఇంటికి వెళ్లి చూడగా.. ఆవరణలో శాంతి విగతజీవురాలై కనిపించింది. ఆమె తలకు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. బెడ్రూమ్లో శ్రీనివాస్ మృతదేహం పక్కనే లైసెన్స్డ్ తుపాకీ కనిపించింది. మొదట శ్రీనివాస్ తన భార్యను చంపి, అనంతరం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటన చోటు చేసుకున్న సమయంలో కుమారుడు ఇంట్లో లేడు. కుమార్తె తన గదిలో నిద్రిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. టెక్సాస్ యూనివర్శిటీలో చదువుకుంటున్న శ్రీనివాస్ కుమారుడిని పోలీసులు ఇంటికి పిలిపించి, ఆరా తీస్తున్నారు.