సింగపూర్ అల్లర్లు: మరో భారతీయుడి అరెస్ట్
అయితే ఈ అరెస్టుపై పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. కాగా లిటిల్ ఇండియాలో నడుచుకుంటూ వెళుతున్న శక్తివేల్ కౌరవేలు(33) అనే భారతీయుడ్ని ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షిణాసియాకు చెందిన సుమారు 400 మంది కార్మికులు అల్లర్లకు దిగారు.
దక్షిణాసియా ప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతమే సింగపూర్లోని లిటిల్ ఇండియా. ఇక్కడే భారత దేశానికి చెందిన పలువురు వ్యాపారాలు, హోటళ్లు నిర్వహిస్తున్నారు. కార్మికుల అల్లర్లలో సుమారు 39 మంది పోలీసు, రక్షణ సిబ్బందికి గాయాలయ్యాయి. 16 పోలీసు వాహనాలతోపాటు 25 వాహనాలు ధ్వంసమయ్యాయి.
సింగపూర్లో గతంలో 1969లో జరిగిన అల్లర్ల తర్వాత మళ్లీ ఇప్పుడే అలాంటి ఘటన చోటుచేసుకోవడంతో సింగపూర్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని ప్రకటించింది. ఘటన జరిగిన వెంటనే 27మంది దక్షిణాసియాకు చెందిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అదుపులోకి తీసుకున్న 33మంది భారతీయుల్లో ఏడుగురిని విడుదలు చేశారు. అల్లర్లలో వీరి పాత్ర ఏమిలేదని రుజువుకావడంతో విడుదల చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అల్లర్లతో ప్రమేయం ఉన్న 56మందిని గుర్తించామని, వారిలో భారత, బంగ్లాదేశీయులు ఉన్నారని చెప్పారు. వారిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నేరం రుజువైతే వారి దేశాలకు పంపనున్నట్లు పోలీసులు చెప్పారు.