మరో సిక్కు, అతడి తల్లిపై దాడి: హేట్క్రైంపై త్వరలో భేటీ
ఆగస్టు 7వ తేదీన రాత్రి తమపై దాడి జరిగిందని ఫిజిషియన్ సైంటిస్టు అయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మత సాంప్రదాయ ప్రకారం టర్బన్స్ ధరించామని, అయితే సుమారు 10మంది యువకులు ఒసాబా బిన్ లాడెన్ అంటూ తమపై దాడి చేశారని అతను తన ఫిర్యాదు పేర్కొన్నారు. అంతేగాక తమ దేశానికి వెళ్లిపోమ్మంటూ హెచ్చరించారని చెప్పారు.
తమ తల్లి పట్ల వారు అభ్యంతరకరంగా ప్రవర్తించారని, దూషించారని తెలిపారు. తాను వద్దని వారిస్తే తనపై పిడిగుద్దులు గుద్దారని, అందరూ కలిసి దాడి చేశారని చెప్పారు. పారిపోతూ తమపై ఓ బాటిల్ విసిరి వెళ్లారని తెలిపారు. వారిని వెంబండించేందుకు ప్రయత్నించినా తీవ్రమైన గాయాలవల్ల తాను కదల్లేకపోయానని చెప్పాడు. పోలీసులకు ఫోన్ చేయడంతో బాధితులను వారు ఆస్పత్రికి తరలించారు.
తనను చూసేందుకు భారతదేశం నుంచి తన తల్లి ఇక్కడి వచ్చిందని, ఈ సమయంలో మా ఇద్దరిపై దాడి జరిగిందని తెలిపారు. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరాడు. తమ వర్గంపై దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పోలీసులను కోరారు. తమ తల్లి అమెరికన్స్ ఇతర మతాలను గౌరవిస్తారని భావించేవారని.. అయితే ఇలాంటి ఘటన ఎదురుకావడం విచారకరమని తెలిపారు.
కాగా, తమ వర్గంపై వరుసగా దాడులు జరగడంపై సిక్కు సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలోని పలు గురుద్వారాలకు చెందిన ప్రతినిధులు ఈ వారంలో సమావేశం కానున్నట్లు ఇటీవలే ఏర్పాటైన ఎన్ఎస్సి ప్రకటించింది. అమెరికాలో నివసిస్తున్న సిక్కుల ప్రయోజనాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. అమెరికాలోని సిక్కులంతా ఒకే ఎజెండాపై సమావేశం కానుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.