బ్యాంకాక్లో కాల్పులు: భారతీయుడు మృతి, ఇద్దరికి గాయాలు
బ్యాంకాక్: థాయిలాండ్లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో 42ఏళ్ల గఖ్రెజర్ ధీరజ్ అనే ఓ భారత పర్యాటకుడు ప్రాణాలు కోల్పోయాడని అక్కడి పోలీసులు సోమవారం ప్రకటించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు భారతీయులకు తీవ్రగాయాలయ్యాయి. వీరితోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
రత్చథేవీలోని సెంటారా వాటర్గేట్ పవిల్లియన్ హోటల్ వెనుక ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారతీయుడితో పాటు లావోస్కు చెందిన కియోవోంగ్సా థోనెకియో (28) అనే పర్యాటకుడు కూడా మృతి చెందాడని పోలీసులు చెప్పారు. మరో ఇద్దరు థాయికి చెందిన వ్యక్తులు, లావోస్కు చెందిన ఓ పర్యాటకుడికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు.
ఆదివారం రాత్రి హోటల్లో భోజనం చేసిన భారత పర్యాటకులు తమ బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అక్కడి స్నూకర్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన రెండు గ్యాంగ్లు పరస్పరం తుపాకులతో కాల్పులు జరుపుకోవడంతో ఆ బుల్లెట్లు పలువురు పర్యాటకులకు తగిలాయని స్థానిక పోలీస్ మేజర్ జనరల్ సమరర్న్ సమ్రుయాజ్కిత్ మీడియాకు తెలిపారు.
ఘటనాస్థలిలో పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, 20 మందితో కూడిన రెండు గ్యాంగులు తుపాకులు, కత్తులు, కర్రలతో క్లబ్లోంచి బయటకు దూసుకొచ్చి వీధిలో పరస్పరం ఘర్షణకు దిగాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే లోపు అందరూ అక్కడి నుంచి పరారయ్యారని చెప్పారు.