భారత సంతతి శాస్తవేత్తకు అమెరికా అత్యున్నత అవార్డు
న్యూఢిల్లీ: శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యున్నత సేవలందించినందుకు గాను భారత సంతతి శాస్త్రవేత్త ధామస్ కైలాథ్ అమెరికాలో అత్యున్నత అవార్డుని అందుుకున్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 'నేషనల్ మెడల్ ఆఫ్ సైన్సు' అవార్డుని 79 ఏళ్ల శాస్త్రవేత్త ధామస్ కైలాథ్కు అందించారు.
22 ఏళ్ల వయసులో తన రీసెర్చ్ కోసం ధామస్ కైలాథ్ అమెరికాకు వచ్చారని.. టెక్నాలజీ రంగంలో ఆయన సేవలను ఒబామా కొనియాడారు. ఇక ధామస్ కైలాథ్ విషయానికి వస్తే 1935లో కేరళలో జన్మించారు.
1956లో పుణె యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1961లో మసాచుసెట్స్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ అందుకున్నారు. మసాచుసెట్స్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ అందుకున్న తొలి భారతీయ విద్యార్ధి ధామస్ కావడం విశేషం.
ఆ తర్వాత ధామస్ కైలాథ్ స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరారు. పలు పుస్తకాలను ఆయన రాశారు. సైన్స్, ఇంజనీరింగ్ రంగంలో ధామస్ కైలాథ్ సేవలకు గాను 2009లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.