తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఖతర్లోని భారత రాయబారి డా. దీపక్ మిట్టల్ హాజరయ్యారు. వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
బతుకమ్మ ఆటపాటలు
తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం ఖతర్లో జరుగనున్న ప్రపంచ కప్ ఫుట్ బాల్ కోసం ఖతర్ ప్రభుత్వం నిర్మించిన అత్యాధునిక స్టేడియంల వద్ద బతుకమ్మలతో పాట విడుదల చేశామని తెలిపారు.
బతుకమ్మ వేడుకలు ముఖ్య అతిథులుగా..
కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఖతర్ భారత రాయబారి డా. దీపక్ మిట్టల్, వారి సతీమణి అల్పన మిట్టల్ హాజరు కాగా, ఐసీబీఎఫ్ అధ్యక్షులు వినోద్ నాయర్, ఐసీసీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం హెబ్బగెలు, ప్రధాన కార్యదర్శి కె. కృష్ణ కుమార్, ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ కోడూరి, ఐసీబీఎఫ్ ఎంసీ రజినీ మూర్తి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, ఆడపడుచులు బతుకమ్మ ఆట పాటలతో అలరించగా.. గల్ఫ్ కార్మిక సోదరులు సైతం పల్లె పాటల తో ధూమ్ ధాంగా పాల్గొన్నారు. వివిధ రకాలుగా గల్ఫ్ కార్మికులకు అండగా నిలుస్తున్న వారిని సన్మానించారు.
బతుకమ్మ శోభ..
అన్ని వర్గాల మద్దతుతో పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమంలో దాదాపుగా 1500 పైగా ప్రవాసులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను నీళ్లలో వదిలి సత్తు పిండి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.