ఎలుగుబంటి దాడిలో ఎన్నారై యువకుడు మృతి
న్యూయార్క్: ఓ ప్రవాస భారతీయ యువకుడు ఎలుగుబంటి బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎడిసన్కు చెందిన ఐదుగురు స్నేహితులతో కలిసి మృతుడు దర్శ్ పటేల్(22) అప్షావా ప్రీసర్వ్ గుండా నడుచుకుంటూ వెస్ట్ మిల్ఫోర్డ్ ప్రాంతానికి వెళుతున్నారు.
చిట్టడవిలాంటి ఆ ప్రాంతంలో ఓ సరస్సు కూడా ఉంది. అయితే వారు వెళుతున్న సమయంలో ఓ ఎలుగుంటి ఎదురుకావడంతో భయాందోళనకు గురైన వారందరూ తలోదారిన పరుగులు తీశారు. అయితే ఆ ఎలుగుబంటి వారి వెంటపడింది. నలుగురు మిత్రులు ఎలుగుబంటి నుంచి బయటపడ్డారు. వారందరూ కలుసుకున్న తర్వాత దర్శ్ పటేల్ మిస్సయాడని గుర్తించారు.
వెంటనే అతని సెల్ఫోన్కు ఫోన్ చేశారు. అతను ఫోన్ ఎత్తకపోవడంతో వెస్ట్ మిల్ఫోర్డ్ సెర్చ్ అండ్ రెస్య్కూ యూనిట్ను ఆశ్రయించారు. వారు అక్కడ దాదాపు రెండు గంటలపాటు గాలింపు చేపట్టి దర్శ్ పటేల్ మృతదేహాన్ని గుర్తించారు. ఎలుగుబంటి దాడిలో దర్శ్ మృతి చెందాడని రెస్క్యూ సిబ్బంది తెలిపారు.
అయితే ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎలుగుబంటి లాంటి జంతువులు తిరగవని పర్యావరణ అధికారి ఒకరు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్శ్ మృతిపై విచారణ కొనసాగిస్తున్నారు.