ఎన్నారై టీడీపీ విభాగం వెబ్సైట్ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు: సేవలపై ప్రశంసలు
హైదరాబాద్: వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగుదేశం పార్టీ అభిమానులను, వారు ఏర్పాటు చేసుకున్న సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాన్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్ www.nritdp.comను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ వెబ్సైట్ ద్వారా ఎన్ఆర్ఐ నుంచి పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 1200 మంది కౌన్సిల్ మెంబర్స్ని ఏర్పాటు చేయటంతో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్లైన్ - ల్యాండ్ లైన్ +918645350888 వాట్సాప్ +918950674837 ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వటంతోపాటు, ఏపీలో ఐటీ, టెక్నికల్ వంటి పలు ఉద్యోగ, ఉపాధి శిక్షణా కార్యక్రమాలు ఈ విభాగం నిర్వహించనుంది.

విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ప్రోసిజరల్ గైడ్ లైన్స్ ఇవ్వటంతోపాటు ఆపద సమయంలో సాయం అందించేందుకు ఈ ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ పని చేస్తుంది. ఈ సందర్బంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... యుద్ద సమయంలో ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి తరలించటంలో ఎన్ఆర్ఐ టిడిపి సెల్ చేసిన సేవలను కొనియాడారు.

వివిధ దేశాల్లో టీడీపీ 40 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారని చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విదేశాల్లో స్థిరపడ్డ టీడీపీ అభిమానులంతా ఈ వైబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డా. వేమూరి రవి, రాజశేఖర్ చప్పిడి తో పాటుగా పార్టీ అమెరికా కోఆర్డినేటర్ కోమటి జయరాం పాల్గొన్నారు.