అమెరికాలో వివాహిత మృతి, అల్లుడే హంతకుడు అంటోన్న మహిళ పేరంట్స్..
అమెరికాలో ఓ వివాహిత చనిపోయింది. న్యూజెర్సీలో ప్రేమలత (32) మృతిచెందింది. ఈమె స్వస్థలం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం. ప్రేమలతకు 2016లో పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్ నాయుడితో పెళ్లయ్యింది. మరుసటి ఏడాది వీరు అమెరికా వెళ్లారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు గానీ.. ప్రేమలత విగతజీవిగా మారింది.
ప్రేమలత అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడంతో సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి బలం చేకూర్చేందుకు ఆమె పేరంట్స్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రేమలతను భర్తే హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారిద్దరి మధ్య గొడవ ఉందో లేదో తెలియదు కానీ.. మృతదేహాన్ని ఇండియా పంపించాలని ప్రేమలత తండ్రి త్యాగరాజులు నాయుడు కోరారు. ఇందుకు అల్లుడు సుధాకర్ నాయుడు నిరాకరించారు. దీంతో వారి అనుమానం మరింత పెరిగింది. ఏదో జరిగిందని.. అందుకే పంపించడం లేదు అని చెబుతున్నారు.
ప్రేమలత ఆత్మహత్య చేసుకుందని తమకు మంగళవారం రాత్రి సమాచారంచ వచ్చిందని త్యాగరాజులు నాయుడు తెలిపారు. దీంతో వారు తీవ్ర ఆవేదన చెందారు. తొలుత అల్లుడిపైనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రేమలత మరణం వెనుక కుట్ర ఉందని, అల్లుడే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ మేరకు చిత్తూరు కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తాకు పిటిషన్ కూడా అందజేశారు. దీనిని కలెక్టర్ రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వాలకు ఫార్వార్డ్ చేయాల్సి ఉంది. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.