మీ కాళ్లు పట్టుకుంటా.. ఈ నరకం నుంచి కాపాడండి: సౌదీ నుంచి ఓ తెలుగు మహిళ వీడియో మెసేజ్
భర్త మరణించడంతో.. కుమార్తె భవిష్యత్తు కోసం కష్టపడి పని చేసి నాలుగు రాళ్లు సంపాదించాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ సౌదీకి వెళ్లిన ఓ తెలుగు మహిళ అక్కడ చిక్కుల్లో పడింది.
కడప/రియాద్: భర్త మరణించడంతో.. కుమార్తె భవిష్యత్తు కోసం కష్టపడి పని చేసి నాలుగు రాళ్లు సంపాదించాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ సౌదీకి వెళ్లిన ఓ తెలుగు మహిళ అక్కడ చిక్కుల్లో పడింది.
అయిదు నెలల నుంచి జీతం అందక, స్వదేశానికి రావడానికి ఆమె యజమాని అంగీకరించక.. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన శివమ్మ అనే మహిళ నరకయాతన అనుభవిస్తోంది. యజమాని చిత్రహింసలను తట్టుకోలేక సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోను పోస్ట్ చేసింది.
'నెలకు రూ.30 వేల జీతం వస్తుందని చెబితే నమ్మి ఇక్కడికొచ్చాను.. నన్ను మోసం చేశారు. నాకు చెప్పిందంతా అబద్ధం. అప్పుచేసి మరీ సౌదీకి వచ్చాను. నన్ను ఓ సౌదీ యజమానికి అమ్మేశారు. నన్ను భారత్కు పంపించమంటే ఆయన ఒప్పుకోవడం లేదు. మీ కాళ్లు పట్టుకుంటా.. నేను ఎలాగైనా సొంతూరికి చేరుకునేలా చేయండి..' అంటూ ఆ వీడియోలో శివమ్మ పేర్కొంది.
అంతేకాదు.. 'ఇక్కడ మూడు రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నా. అయిదు నెలల నుంచి నాకు జీతం లేదు. బయటకు పంపించడంలేదు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే నా తల పగలగొట్టారు.. నన్ను ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఆ నొప్పులు భరించలేక అల్లాడిపోతున్నా. ఇంటి దగ్గర నన్ను పంపిన వ్యక్తికి ఫోన్ చేస్తే.. 'నువ్వు చస్తే చావు.. బతికితే బతుకు.. డబ్బులు కట్టేశా..' అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని వాపోయింది.
'నేను పనిచేయలేక అబద్ధాలు ఆడుతున్నానని అంటున్నారు. నేను ఎలాగైనా ఇండియాకు రావాలి. అక్కడ నాకో కూతురు ఉంది. నెలకు రూ.3 వేలు అద్దె ఇస్తానని బంధువుల ఇంట్లో ఉంచా. నా దగ్గర ఉన్న ఫోన్ కూడా లాగేసుకున్నారు. మరో పనిమనిషి పోన్లోంచి ఈ వీడియో మెసేజ్ చేస్తున్నా. నన్ను దయచేసి రక్షించండి. ప్లీజ్'... అంటూ శివమ్మ తన గోడు వెళ్లబోసుకుంది.