మళ్లీ జాత్యహంకారం బుసలు! న్యూజెర్సీలో భారత సంతతి మహిళపై దుష్ప్రచారం!
అమెరికాలో మరోసారి జాత్యాహంకారం బుసలుకొట్టింది. న్యూజెర్సీలోని అయిదో పెద్ద నగరమైన ఎడిసన్లో ఓ భారతీయ మహిళ శ్వేతజాతీయులకు టార్గెట్గా మారింది.
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి జాత్యాహంకారం బుసలుకొట్టింది. న్యూజెర్సీలోని అయిదో పెద్ద నగరమైన ఎడిసన్లో ఓ భారతీయ మహిళ శ్వేతజాతీయులకు టార్గెట్గా మారింది. నగర స్కూల్ బోర్డు ఎన్నికలో పోటీ చేస్తున్న భారతీయ మూలాలున్న ఫాల్గుణి పటేల్ పై జాత్యహంకార మాఫియా విష ప్రచారానికి తెరలేపింది.
ఫాల్గుణి పటేల్ను బయటి వ్యక్తిగా పేర్కొంటూ, జాత్యహంకార పదజాలంతో కూడిన 'మేక్ ఎడిసన్ గ్రేట్ ఎగైన్' అనే నినాదాన్ని హెడ్ లైన్గా పెట్టి ఉన్న పోస్టు కార్డులను గతవారం అన్ని ఇళ్లకు పంపించారు. సిఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్, న్యూ యార్క్ టైమ్స్, అనేక ఇతర మీడియా సంస్థలు, రేడియో స్టేషన్స్ ఈ ఉదంతాన్ని ప్రముఖంగా ప్రస్తావించాయి.
విస్తరిస్తోన్న జాత్యహంకారం...
అమెరికాలో నల్లవారు, యూదులు, ముస్లిం లకు పరిమితం అయిన జాత్యహంకార వేధింపులు రాను రాను ప్రవాస భారతీయులకు విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
అమెరికా కాంగ్రెస్, సెనేట్, అసెంబ్లీ ఎన్నికలకు పరిమితమైన ద్వేషపూరిత పోస్టుకార్డుల వ్యవహారం చివరికి స్కూల్ బోర్డు ఎన్నికలకు వ్యాపించడం అనేది అగ్రరాజ్యంలో దిగజారిన పరిస్థితిని సూచిస్తోంది.
దేశం నుండి తరిమేయండి...
వివాదానికి కారణమైన ఈ పోస్టు కార్డులో ఉన్న స్కూల్ బోర్డ్ అభ్యర్థులు జెర్రీ షీ మరియు ఫాల్గుణి పటేల్ ఫోటోలపై ‘డిపోర్ట్' (దేశంనుండి తరిమేయండి) అనే స్టాంపును ముద్రించారు. ఎడిసన్ నగరాన్ని భారతీయులు, చైనా వాళ్ళు ఆక్రమించుకుంటున్నారని, నగరం క్రికెట్ పిచ్లతో నిండిపోతోందని పిచ్చి రాతలు రాశారు. ‘ఇప్పటివరకు జరిగింది చాలు, ఇకనైనా మేల్కొనండి' అని ఈ ద్వేషపూరిత పోస్టు కార్డును జాత్యహంకార మాఫియా ఎడిసన్ నగరంలోని ప్రతి ఇంటికి పంపించింది.
ఓటమి భయంతోనే ఇలా...
మొత్తం 9 మంది స్కూల్ బోర్డ్ అభ్యర్థులు రంగంలో ఉండగా, కేవలం "జెర్రీ షీ మరియు ఫాల్గుణి పటేల్" లపై జాత్యహంకార మాఫియా విష ప్రచారానికి దిగడానికి కారణం, వారిద్దరూ ఒక కూటమిగా నిలబడి పోటీచేయడమే. 1993 నుండి ఎడిసన్ నగరంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ రిపబ్లికన్ పార్టీ ఓడిపోతూ ఉందని, పైగా ఈ సారి స్కూల్ బోర్డుకు జరుగుతున్న ఎన్నికల్లో భారత్, చైనా ఓటర్లు "జెర్రీ షీ మరియు ఫాల్గుణి పటేల్" ప్యానల్కు మద్దతుగా నిలబడతారని భీతిల్లి, వీరిపై విషప్రచారానికి జాత్యహంకార మాఫియా తెగబడ్డట్లు తెలుస్తోంది.
ఫాల్గుణికి మద్దతుగా ఎన్నారైల ర్యాలీ...
అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్ నగరానికి 60 కి మీ దూరంలో ఉన్న ఎడిసన్లో జరిగిన ఈ సంఘటన విషయమై ఎన్నారైలు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియాల్లో ఎన్నారై సంఘాలు, ఎన్నారైలు ఈ జాత్యహంకార సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యం లో ఎన్నిక కు ఒక రోజు ముందు అంటే సోమవారం నవంబర్ 6న ఎడిసన్లో ఇండియా రోడ్గా ప్రసిద్ధిగాంచిన ‘ఓక్ ట్రీ రోడ్'లో బాధిత ఫాల్గుణి పటేల్కు మద్ధతుగా పలు భారత సంస్థలు ర్యాలీకి నడుంకట్టాయి.
కలసికట్టుగా ఎదుర్కోవాలి: చివుకుల ఉపేంద్ర
ఇటువంటి ద్వేషపూరిత సంఘటనలను ఎదుర్కొనే విషయంలో ప్రవాస భారతీయులు కలసికట్టుగా పనిచెయ్యవలసిన అవసరం కనిపిస్తోంది. స్థానిక భారత రాయబార కార్యాలయం, భారత్ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం లో జోక్యం చేసుకొని జాత్యహంకార మాఫియా ను శిక్షించే విషయంలో అమెరికా ప్రభుతంపై ఒత్తిడి తీసుకురావడం అత్యంత అవసరమంటూ ప్రవాసాంధ్రుడు, న్యూ జెర్సీ అసెంబ్లీ సభ్యుడు అయిన చివుకుల ఉపేంద్ర ద్వేషపూరిత పోస్టు కార్డుల వ్యవహారంపై పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
నేనిక్కడే పుట్టిపెరిగిన దానిని: ఫాల్గుణి పటేల్
డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్త, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదిగా పోటీలో ఉన్న బాధిత మహిళ ఫాల్గుణి పటేల్ ఈ పోస్టు కార్డులపై తీవ్రంగా స్పందించారు. ‘నేను న్యూజెర్సీలో పుట్టి పెరిగాను. నన్ను ఈ దేశం నుంచి తరిమేయాలని ముద్రించడం దారుణం. ఇది అసహ్యకరమైన చర్య..' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో పుట్టి పెరిగిన తాను ఈ దేశంనుండి ఎక్కడికి వెళ్ళిపోవాలో చెప్పాలని ఫాల్గుణి పటేల్ ప్రశ్నించారు.
ఎడిసన్ ఒక్క న్యూ జెర్సీ లోనే 15 ముఠాలు...
న్యూ జెర్సీ రాష్ట్రంలో ఉన్న ఎడిసన్ నగరం మినీ ఇండియాగా పేరుగాంచింది. 2015 జనాభా లెక్కల ప్రకారం ఒక లక్ష మంది ప్రజలున్న ఎడిసన్ నగరంలో 47 శాతం మంది ఆసియా ఖండం నుండి వచ్చారని, వారిలో 25 శాతంమంది భారత్ నుండి వచ్చారని గణాంకాలు చెబుతున్నాయి. జాత్యహంకార సంఘటనలపై వ్యతిరేకంగా పోరాడే ఒక స్వచ్ఛంద సంస్థ అంచనా ప్రకారం న్యూ జెర్సీ లో దాదాపు 15 జాత్యహంకార ముఠాలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని ఒక్క న్యూ జెర్సీ లోనే 15 జాత్యహంకార ముఠాలు ఉంటే, మరి మిగతా 49 రాష్ట్రాల పరిస్థితి ఏమిటని ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు.
అదే నినాదం ఇక్కడ కూడా...
జాత్యహంకార మాఫియా వాడిన ‘మేక్ ఎడిసన్ గ్రేట్ ఎగైన్' (ఎడిసన్ నగరాన్ని తిరిగి గొప్పగా నిర్మిద్దాం) నినాదం గతంలో అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ట్రంప్ వాడిన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' (అమెరికాను తిరిగి గొప్పగా నిర్మిద్దాం) నినాదం పోలి ఉండడంతో సహజంగా ఫాల్గుణి పటేల్కు వ్యతిరేకంగా స్కూల్ బోర్డు ఎన్నికల్లో నిలబడ్డ రిపబ్లికన్ అభ్యర్థులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఎడిసన్ నగర మేయర్ రిపబ్లికన్ అభ్యర్థి ఒకరు ఈ సంఘటనను ఖండిస్తూ ‘ఈ సిగ్గుమాలిన పనికి పాల్పడ్డ వ్యక్తులను చట్టం ముందుకు తీసుకురావాలి..' అని హడావుడిగా ప్రకటించి తప్పించుకున్నారు.
పోలీసులు, అధికార యంత్రాంగం వేట...
ఇదే ఎన్నికల్లో మేయర్ పదవికి పోటీ పడుతున్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి టామ్ లాంకీ ఈ ద్వేషపూరిత పోస్టు కార్డుల చర్యను కిరాతకంగా అభివర్ణించారు. ఈ ద్వేషపూరిత పోస్టు కార్డులు ముద్రించడానికి అవసరమైన సొమ్ము ఎవరు చెల్లించారన్న విషయం సదరు కార్డులపై ముద్రించి లేనందున ఈ పోస్టు కార్డులు న్యూ జెర్సీ ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించాయని పలువురు న్యాయనిపుణులు చెబుతున్నారు. ఎడిసన్ నగర పోలీసులు, జిల్లా యంత్రాంగం ఈ ద్వేషపూరిత పోస్టు కార్డుల పంపిణికి పాల్పడినవారి కూపీ లాగే పనిలో ఉంది.