ఆత్మహత్యలొద్దు: రైతులకు పిటిఏ సంఘీభావం
ఫిలడెల్ఫియా: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఫిలడెల్ఫియా తెలంగాణ సంఘం(పిటిఏ) ఆధ్వర్యంలో భారతదేశంలోని రైతులకు సంఘీభావ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని పిటిఏ సభ్యులు సూచించారు.
రైతులెవ్వరూ అధైర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు తమ కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగుల్చుతాయని అన్నారు. రైతులకు మద్దతు పలుకుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
రైతులకు కావాల్సిన సహకారం అందించాలని, వ్యవసాయ భూముల్లో పరీక్షలు, వ్యవసాయ పనిముట్లు అందించాలని బాబు బయ్యన్న చెప్పారు. కమలనాథన్ కమిటీ సూచనలను అమలు చేయడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం చూపవచ్చని తెలిపారు.
ముల్కనూర్ కో ఆపరేటివ్ బ్యాంక్ మాజీ సభ్యులు, రైతు నిమ్మ రాజీరెడ్డి మాట్లాడుతూ.. ఎంసిబి లాంటి బ్యాంకులు రైతులను సకాలంలో ఆదుకుంటున్నాయని తెలిపారు. ఇలాంటి బ్యాంకులకు ప్రభుత్వాలు చేయూతనందించాలని అన్నారు. ప్రతీ ప్రాంతంలో ఇలాంటి బ్యాంకులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బ్యాంకులు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాయని చెప్పారు.
శ్రీధర్ గుడాల మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలను చేపట్టాలని అన్నారు. ప్రవాసులందరూ దేశంలోని రైతులందరికీ సంఘీభావం తెలపాలని పిటిఏ కోరింది.
కార్యక్రమంలో నారాయణ రెడ్డి, మాధవ మాసర్ల, జయన్ నల్లు, సుధీర్ రాజు, పవన్ తిరునహరి, సురేష్ బొందుగుల, సత్య యాస, రవి పాపగారి, శ్రీనివాస్ కొత్తూరు, ముజీబుర్ రెహమాన్, నిమ్మ రాజీరెడ్డి, బాబు రావు బయ్యన్న, శ్రీధర్ గుడాల, రవి మేరెడ్డిలు పాల్గొన్నారు.