30 ఏళ్ల వేడుకల్లో హీరో శివాజీ
హైదరాబాద్: న్యూ ఇంగ్లాండు తెలుగు ప్రజల కలల పంటగా ఆవిర్భవించిన టిఎజిబి (TAGB) ముచ్చటయిన మూడు పదుల వయసుకి చేరిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని సంబరాలు TAGB కార్యనిర్వాహణ బృందసారధ్యంలో అంగరంగ వైభవంగా అక్టోబరు 8, శనివారం, Massachusetts లోని ఏండోవర్ నగరంలో అంబరాన్ని అంటే విధంగా జరిగేయి.
ఈ 30వ సంవత్సర వార్షికోత్సవాలను స్టీరింగ్ కమిటీ డా. హరిబాబు ముద్దన, బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్మన్ మరియు ప్రెసిడెంట్ చంద్ర తాళ్లూరి నాయకత్వంలో నిర్వహించింది. ఈ కార్య క్రమానికి మోహన్ నన్నపనేని, రవి ఐకా, సుబ్బు కోట వంటి పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ముఖ్య అతిధులుగా నటుడు శివాజీ, టీవీ9 రవి ప్రకాశ్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ ఉత్సవాలు ఉదయం శ్రీ సీతారామకల్యాణంతో శుభారంభం చేసుకుని ఆపై కోదండరాముని ఆశీస్సుల అండదండలతో విశాలమైన ప్రాంగణంలో పలు పసందైన సాంస్కృతిక కార్యక్రమాల తో వెలుగులీని దాదాపు 1200 మందిపైగా న్యూ ఇంగ్లండ్ వాసులని అలరించాయి.
స్థానిక కళాకారుల ప్రతిభని ఆవిష్కరిస్తూ గణపతి ప్రార్థన, బతుకమ్మ వైభవం ఒక ఎత్తైతే, తెలుగువాళ్ళ శాస్త్రీయనృత్యమైన కూచిపూడికి పట్టంకడుతూ నభూతోనభవిష్యతి అనేలా ప్రదర్శింపబడిన 'శ్రీ కృష్ణపారిజాతం' నృత్యనాటకం ఇంకొక ఎత్తు. సృజనాత్మకతకి పదునుపెట్టిన గేం షో 'నువ్వా - నేనా' అందరి అభిమానాన్ని గెలుచుకుంది.
ఈ వేడుకల శోభని ఇనుమడింపచేయమంటూ TAGB పంపిన ప్రత్యేక ఆహ్వానాన్ని సహృదయంతో మన్నించి వారి అనన్య ప్రతిభాపాటవాలతో బోస్టన్ వాసులని రంజింపచేసిన ప్రముఖులలో మాటల మాంత్రికుడు - శ్రీ చంద్ర బోస్, శ్రీ శివాజి, టివి 9 అధినేత - శ్రీ రవిప్రకాష్, one and only శ్రీ శివారెడ్డి, మిమిక్రీతో దుమ్ము లేపిన - శ్రీ రమేష్, తమ తీయని గానాలాపనతో అందరినీ స్వరగంగాఝరులలో మునకలెత్తించిన సూపర్ సింగర్సు కృష్ణ చైతన్య, దీపు, అంజనా సౌమ్య, లిప్సిక , కలర్ ఫుల్ చిలకలు అంకిత, మృదుల ఈ వేడుకలకి తమదైన బాణీలో తళుకులద్దారు.
ఆహూతుల అన్ని అవసరాలనూ దృష్టిలో పెట్టుకుని అత్యంత శ్రద్ధతో తీర్చబడ్డ ఈ సంబరాలలో ప్రముఖ వయొలిన్ విద్వాంసులు శ్రీ అన్నవరపు రామస్వామి గారికి ప్రత్యేక సన్మానం జరిగింది. తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ సంస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి సాయి రాణి రవిని వేదిక మీద సత్కరించారు. తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ వివిధ రంగాలలో తమ సేవలనందించే పలు ప్రముఖులను సేవా పురస్కారాలతో సత్కరించింది.
ఈ అవార్డులను శ్రీ యుతులు మోహన్ నన్నపనేని, డా. హరిబాబు ముద్దన్న, ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్ కాకి, బాబురావు పోలవరపు, డా. శేషగిరి రావు మేక, డా. శశి సోంపురం, శ్రీమతి శైలజ చౌదరి తుమ్మల మరియు శ్రీమతి పద్మజ బలభద్రపాత్రుని మొదలైన వారికి అందజేశారు. వేడుకల విజయానికి అహోరాత్రాలు కృషిచేసిన స్వచ్ఛంద కార్యకర్తలకు కృతజ్ఞతాభినందనలను అందచేసింది TAGB కార్యనిర్వాహక బృందం. పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రీన్ టీం వారు అందించిన రీ సైక్లింగ్ తోడ్పాటు అందరిని ఆకట్టుకుంది.
ఎన్నోబాలారిష్టాలను దాటి, మైలురాళ్ళు చేరుకుని, పలు హంగులను, ౩౦ ఏళ్ళ ఘనచరిత్రను తన సొంతం చేసుకున్న TAGB, ౩౦ సంవత్సరాల పండుగను అత్యంత కోలహంగా, తనను బాల్యంలో సాకిన పితృసమానులను, పెంచి పెద్ద చేయటంలో చేయూతనిచ్చిన సహోదరులనూ కలుపుకుంటూ, గడిచిన ప్రతి వత్సరం అనుభవాల గడిలో వేసుకుంటూనే, నేర్చుకున్న పాఠాలను తోడు తెచ్చుకుంటూ మరిన్ని మెరుపుల కళలనూ, కొత్త అందాలను కలిపి వేడుకగా చేసుకుంది.
ఈ మెగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన స్టీరింగ్ కమిటీ సభ్యులు: డా. హరిబాబు ముద్దన్న, మోహన్ నన్నపనేని, శ్రీనివాస్ కాకి, ప్రకాష్ రెడ్డి, బాబురావు పోలవరపు, శివ దోగిపర్తి, శ్రీనివాస్ కొల్లిపర, రమేష్ బాబు తళ్ళం, మూర్తి కన్నెగంటి, రాజా చిలకమర్రి, కృష్ణమూర్తి నాయుడు, శంకర్ మగపు, చంద్ర తాళ్లూరి, శ్రీనివాస్ బచ్చు, మణిమాల చలుపాది, ప్రదీప్ రెడ్డి పెనుబ్రోలు, రమణ దుగ్గరాజు, సురేందర్ మాదాడి, మరియు సీతారాం అమరవాది.