హెచ్1బీ వీసాపై నిర్ణయం వాయిదా: భారత జీవిత భాగస్వాములకు భారీ ఊరట
ముంబై/వాషింగ్టన్: అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం హెచ్1-బీ వీసాదారుల భాగస్వాములకు మరీ ముఖ్యంగా భారతదేశ నిపుణులకు వారి కుటుంబాలకు భారీ ఉపశమనాన్ని కలిగిస్తుందనే చెప్పాలి.
హెచ్1-బీ వీసాదారుల భాగస్వాములకు సంబంధించిన వర్క్ పర్మిట్లపై నిర్ణయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారధ్యంలోని అమెరికా సర్కార్ ఓ నాలుగు నెలల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ప్రకటించింది.
మరో నాలుగు నెలలు
‘హెచ్4 వీసాల మీద వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్-1బీ వీసా దారుల భాగస్వాములను ఉద్యోగాల నుంచి తొలగించే నిర్ణయంపై జూన్ వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోబోం. వాళ్లని తొలగించాలని తీసుకునే నిర్ణయం దేశంపై ఆర్థికంగా ఎటువంటి ప్రభావం చూపుతుందనే దాన్ని పరిశీలించాల్సి ఉంది. అందువల్ల అప్పటి వరకు హెచ్-1బీ భాగస్వాముల ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు' అని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది.
ఒబామా తీసుకొస్తే..
2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్కార్డు కోసం ఎదురుచూసే వారి భార్య/భర్తలు యూఎస్లోని వివిధ కంపెనీల్లో హెచ్-4 డిపెండెంట్ వీసాల కింద పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ ఓ విధానాన్ని తీసుకొచ్చారు.
ట్రంప్ తొలగించే యత్నం
కానీ, దీన్ని ఫిబ్రవరి 28 నుంచి తొలగిస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పుడు హెచ్-4వీసాదారుల తొలగింపుపై సరైన నిర్ణయం తీసుకోలేదని అందుకు కొద్దిగా సమయం పడుతుందని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విధానంలో గణనీయమైన మార్పులు చేయాల్సి ఉందని.. వాటిని ఆర్థికపరంగా కూడా పూర్తిగా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని డీహెచ్ఎస్ పేర్కొంది. ఈ నిర్ణయం వాయిదా పడటంతో భారత వృత్తి నిపుణుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
భారతీయులే అధికం
అంతకుముందు అమెరికా హోం శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ-డీహెచ్ఎస్) ఈ వర్క్ పర్మిట్లపై ఫిబ్రవరి 28 కల్లా ఓ నిర్ణయం తీసుకోవాలని భావించింది. కానీ, సమీక్షలో జాప్యం కారణంగా దీనిపై నిర్ణయాన్ని జూన్ నెలకు వాయిదా వేసింది. ఇది తప్పకుండా మనదేశానికి చెందిన వృత్తి నిపుణులకు తాత్కాలికంగా భారీ ఉపశమనాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. హెచ్1-బీ ప్రోగ్రామ్ అనేది విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ వీసాలను ఉపయోగించుకుంటున్న వారిలో భారతీయులే అధికులు. తర్వాతి స్థానంలో చైనీయులున్నారు.