ట్రంప్ దెబ్బ.. ‘గ్రీన్ కార్డ్’ కోసం ఇక 40 ఏళ్లు ఆగాల్సిందే!
కడప: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న కఠిన నిర్ణయాలతో హెచ్1 బీ వీసాపై వచ్చి ఆ దేశంలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు సతీష్ వేమన చెప్పారు.
ట్రంప్ నిర్ణయం ఫలితంగా వీరు గ్రీన్ కార్డు పొందేందుకు కనీసం 40 ఏళ్లపాటు నిరీక్షించక తప్పదన్నారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబ సమేతంగా తన స్వస్థలమైన కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం బి.కమ్మపల్లెకు వచ్చిన సతీష్ పలు విషయాలు వెల్లడించారు.
అమెరికాలో హెచ్1బీ వీసాపై ఉద్యోగాల కోసం వచ్చే విదేశీయులకు కష్టాలు తప్పవని, ఇప్పటికే ఉన్న 5 లక్షల మంది ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సతీష్ వేమన చెప్పారు.
ఆరేళ్ల కన్నా ఎక్కువ కాలం నివాసం ఉండి గ్రీన్కార్డు రాకపోతే అమెరికా వదలి వెళ్లేలా నిబంధనలు మార్చారని, అయితే, ఇది అమలు కానందున 3 లక్షల మంది భారతీయులకు ఊరట లభించినట్టు ఆయన తెలిపారు.
మొత్తంమీద ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసాల విషయాన్ని నిశితంగా పరిశీలిస్తోందని, అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఎఫ్ఐ వీసాలపై వస్తున్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయిందని, అమెరికాలో 4 బోగస్ యూనివర్సిటీలు మూతపడ్డాయని సతీష్ వివరించారు.
40 ఏళ్లు పూర్తి చేసుకున్న తానా 40 వేల మంది కుటుంబ సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. 100 మిలియన్ డాలర్లతో తానా ఫౌండేషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.
50 వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు, కేన్సర్, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు భాష సంస్కృతులను పెంపొందించడానికి ఏటా రూ.20 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు.
శంకర ఐ ఫౌండేషన్తో పాటు బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి కూడా తానా సహకరిస్తోందని, అమెరికాలోని 50 రాష్ట్రాల్లో వెయ్యి మంది తెలుగు వారి కోసం తానా స్వచ్ఛందంగా పనిచేస్తోందని తానా అధ్యక్షుడు సతీష్ వేమన వివరించారు.