బేడీలేసి, దుస్తులిప్పేశారు, ఏడ్చేశాను: దేవయాని
న్యూయార్క్/న్యూఢిల్లీ: వీసా నిబంధనల ఉల్లంఘన కేసులో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయాని కోబ్రాగాడెను అవమానకర రీతిలో అరెస్ట్ చేసిన న్యూయార్క్ పోలీసులు.. కస్టడీలో ఆమెతో మరింత దారుణంగా వ్యవహరించారు. కాగా తనకు జరిగిన అవమానకర పరిణామాలను తన సహోద్యోగ ఐఎఫ్ఎస్ అధికారులకు మంగళవారం దేవయాని కోబ్రాగాడె ఈ మెయిల్ ద్వారా తెలిపారు.
దీంతో అత్యవసరంగా సమావేశమైన ఐఎఫ్ఎస్ అధికారులు, అమెరికా ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పనట్లయితే భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని వెల్లడించారు. తనకు, తన కుటుంబానికి అక్కడ రక్షణ లేకుండా పోయిందని కోబ్రాగాడె ఆ ఈ-మెయిల్లో పేర్కొన్నారు. ఐఎఫ్ఎస్ అధికారిణి అయిన తనకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని తెలిపారు. అమెరికా పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుతో పలుమార్లు కిందపడిపోయినట్లు ఆమె చెప్పారు.
దుస్తులు విప్పించి, తనిఖీ చేశారని, నేరగాళ్లు, మత్తుమందుకు బానిసలైనవారు, సెక్స్వర్కర్ల పక్కన తనను నిలబెట్టి విచారించారని, వారి చర్యలతో పలుమార్లు కిందపడిపోయినట్లు కోబ్రాగాడె తెలిపారు. ఆ సమయంలో తన దేశానికి, తన సహోద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్నందున ఎంతో ప్రశాంతంగా, గౌరవంగా వ్యవహరించానని కోబ్రాగాడె తెలిపారు. కాగా భారత సీనియర్ దౌత్యవేత్త అయిన కోబ్రాగాడె పట్ల అమెరికా అధికారులు వ్యవహరించిన తీరును ఐఎఫ్ఎస్ అధికారులు తీవ్రంగా ఖండించారు. అమెరికా ప్రభుత్వం వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దేవయానిని న్యూయార్క్ పోలీసులు డిసెంబర్ 12 ఉదయం చేతికి సంకెళ్లు వేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వియన్నా కాన్సులర్ కన్వెన్షన్ సంబంధాలు (విసిసిఆర్) కింద కోబ్రాగాడెకు ఇమ్యూనిటీ శక్తి లేదని అమెరికా వర్గాలు ప్రతిస్పందించడం పట్ల భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విసిసిఆర్ ఆర్టికల్ 41కు వ్యతిరేకంగా విచారణ కొనసాగుతోందని భారత్ ఆక్షేపించింది. నిబంధనల ప్రకారం దౌత్య అధికారి విషయంలో విచారణను గౌరవపూర్వకంగా కొనసాగించాల్సి ఉందని తెలిపింది. భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్ అమెరికా కోర్టుల నుంచి ఇమ్యూనిటీని పొంది ఉన్నారని పేర్కొంది.
కాగా దేవయాని అరెస్టు, కస్టడీలో ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించిన తీరుపై భారత ప్రభుత్వం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్లో పర్యటిస్తున్న అమెరికా చట్టసభ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యేందుకు లోక్సభ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, గుజరాత్ సిఎం నరేంద్ర మోడీ, జాతీయ భద్రత సలహాదారు శివ్శంకర్ నిరాకరించారు.