హవాయి-గోవాల మధ్య చారిత్రక ఒప్పందం
న్యూయార్క్: అమెరికాలోని హవాయి-భారతదేశంలోని గోవాల మధ్య సహోదరి పూర్వక సంబంధాల కోసం ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్సీ) హవాయి చాప్టర్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజ్ కుమార్ తీర్మానాలు ఎస్సీఆర్ 20, హెచ్సీఆర్ 20లను 28వ లెజిస్లేటివ్ సమావేశాల్లో డిసెంబర్ 2015న ప్రతిపాదించారు.
ఈ తీర్మానం సెనెట్లో గౌరవ సెనెటర్ బ్రియాన్ తనిగుచి, హౌజ్లో చైర్ ఆఫ్ ది వెటరన్, మిలటరీ అండ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్(విఎంఐ) గౌరవ ప్రతినిధి కెన్ ఇతో ప్రవేశపెట్టారు. మొదట ఈ తీర్మాన్ని జనవరి 29, 2016లో సెనెట్లో ప్రవేశపెట్టగా మొత్తం 25మంది సెనెటర్లు(రిపబ్లికన్లు, డెమోక్రాట్) సంతకం చేశారు.
ఇండియన్ కమ్యూనిటీ, స్థానికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, మతపెద్దలు, పారిశ్రామికవేత్తలు ఈ తీర్మానానికి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో పర్యాటకం, అంతర్జాతీయ సంబంధాల సభ్యులు గౌరవ సెనెటర్ కైలీ కెహెలే, గౌరవ సెనెటర్ బ్రిక్ వుడ్ గలుటేరియా, గౌరవ సెనెటర్ సామ్ స్లోమ్, వైస్ ఛైర్, సెనెట్ మేజార్టీ లీడర్, గౌరవ సెనెటర్ కలానీ ఇంగ్లీష్లు ఈ తీర్మానానికి 2016, ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపారు.
ఏప్రిల్ 14, 2016న విఎంఐ కమిటీ హౌజ్లో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. హవాయి కాంగ్రెస్ వుమన్ తులసి గబార్డ్, ఆమె తండ్రి గౌరవ సెనెటర్ మైక్ గబార్డ్ కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం రెండు గొప్ప రాష్ట్రాల మధ్య గాక, ప్రపంచంలోని రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య జరిగిందని అభిప్రాయపడ్డారు.
కాగా, గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ డా. కుమార్ను సెప్టెంబర్ 2015న అనుంధాన కర్త(లైజన్)గా నియమించింది. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసేందుకు గోవా నుంచి రాష్ట్ర ప్రతినిధులు వచ్చే జులైలో అమెరికా వెళ్లనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్, ఐఏఎఫ్సి ఫౌండర్ డా. కృష్ణా రెడ్డి, కాలిఫోర్నియాలోని ఇండియన్ టూరిజం అసోసియేట్ డైరెక్టర్ లతోపాటు హవాయి గవర్నర్ డేవిడ్ ఏజ్, హవాయి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా గోవా నుంచి వచ్చే ప్రతినిధులకు, హవాయి ప్రముఖులకు ఈస్ట్ వెస్ట్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ హవాయి, ఇస్కాన్ టెంపుల్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. హవాయికి చెందిన ప్రతినిధులు, పర్యాటక మార్కెటింగ్ బృందం నవంబర్ 2016న గోవాను సందర్శించనున్నాయి.
కాగా, తమ తొలి హోటల్ను గోవాలో ప్రారంభించనున్నట్లు ఔట్ ట్రిగ్గర్ హోటల్ వైస్ ప్రెసిడెంట్ మాక్స్ స్వర్డ్ ప్రకటించారు. హవాయి పసిఫిక్ యూనివర్సిటీలో హిస్టరీ బోధించే ప్రొఫెసర్ మార్క్ జాసోన్ గిల్బర్ట్ తన విద్యార్థులను శీతాకాలంలో గోవాకు తీసుకెళ్తానని తెలిపారు.
ఈ ఒప్పందం విద్యా, సంస్కృతి, సాంప్రదాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధ మొక్కలు, హెర్బల్ మందు, పాక కళకు సంబంధించిన కార్యక్రమాలను ఇచ్చిపుచ్చుకోవడం జరుగనుంది. వ్యాపార, క్రీడా, పర్యాటకం, యోగా, ఆయుర్వేద, శిక్షణా కార్యక్రమాలు, అంతర్గత, ప్రపంచ శాంతికి సంబంధించిన కార్యక్రమాలకు ప్రోత్సాహం లభించనుంది.
గత సంవత్సరం గాంధీ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్(జిఐఐపి) ఎస్బీ 332ను హవాయి శాసనసభలో ప్రతిపాదించింది. హవాయి గవర్నర్ డేవిడ్ ఏజ్ ఏప్రిల్ 10, 2015న దీనిపై సంతకం ఆమోదం తెలిపారు. మహాత్మా గాంధీ డేను ఈ బిల్ గుర్తించింది. దీంతో అక్టోబర్ 2నను 'మహాత్మా గాంధీ డే'గా జరుపుకునే మొదటి రాష్ట్రంగా హవాయి చరిత్రకెక్కింది.