క్యాంపస్ మర్డర్ : షికాగోలో హైదరాబాద్కు చెందిన ఇండో -అమెరికన్ అమ్మాయి హత్య
వాషింగ్టన్: అమెరికాలో దారుణాలకు హద్దు అదుపూ లేకుండా పోతోంది. తాజాగా భారత సంతతికి చెందిన 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడి కొందరు హత్య చేశారు. ఈ ఘటన షికాగోలో చోటుచేసుకుంది. ఈ ఉదంతం అక్కడ భారతీయ సమాజంను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పోలీసులు తెలిపారు.
హైదరాబాదుకు చెందిన 19 ఏళ్ల రూత్ జార్జ్ యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో చదువుతోంది. క్యాంపస్లోని గ్యారేజ్లో తన కారు వెనక సీటులో చనిపోయి ఉన్నట్లు కనిపించిందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి 26 ఏళ్ల డొనాల్డ్ తుర్మాన్ను షికాగో మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. డొనాల్డ్కు యూనివర్శిటీతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు.
అయితే రూత్ జార్జ్ను లైంగికంగా వేధించి ఆపై ఆమెను హత్య చేసినందుకు గాను డొనాల్డ్ పై చార్జ్షీట్ నమోదు చేశారు పోలీసులు. రూత్ జార్జ్ మృతదేహంను పోస్టు మార్టంకు తరలించగా.. ఆమె గొంతు నులిమి హత్య చేశాడని వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. రూత్ జార్జ్ కినిసాలజీలో సెకండ్ ఇయర్ చదువుతోందని యూనివర్శిటీ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే రూత్ జార్జ్ తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని యూనివర్శిటీ పోలీసులకు శనివారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఆమె ఫోను ఆధారంగా కాలేజీలోని పార్కింగ్ గ్యారేజీలో ఉన్నట్లు కనుగొన్న పోలీసులు ఆమె మృతదేహాన్నికారులోనుంచి బయటకు తీశారు. ఇక కేసును వెంటనే చేధించేందుకు యూనివర్శిటీ పోలీసులు ఎఫ్బీఐ సహకారం తీసుకున్నారు. కారుపై ఫారెన్సిక పరీక్షలు చేపట్టాలని కోరారు. ఇక విచారణలో భాగంగా పోలీసులు క్యాంపస్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడు డొనాల్డ్, రూత్ జార్జ్ వెనక నడుస్తున్నట్లు గమనించారు.
గ్యారేజీలోకి రూత్ జార్జ్ అర్థరాత్రి 1:35 గంటలకు ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గమనించారు. ఆ తర్వాత నిందితుడు తిరిగి 2:10 గంటలకు బయటకు రావడం పోలీసులు గమనించారు. ఆ తర్వాత పోలీసులు షికాగో మెట్రో కేంద్రంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడు మెట్రో స్టేషన్లోకి వెళ్లినట్లు గమనించారు పోలీసులు. ఇక అక్కడే మాటువేసిన పోలీసులు డొనాల్డ్ను పట్టుకుని అరెస్టు చేశారు. విచారణలో తానే రూత్ జార్జ్ను హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు.