పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయి.. సౌదీలో హైదరబాద్ మహిళ అనుమానాస్పద మృతి
ఆమె భర్త చనిపోయాడు. అంతవరకు హాయిగా సాగిన జీవితంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇద్దరు ఆడపిల్లలు. వారి బంగారు భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి గల్ఫ్కు పయనమైంది. ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. వెళ్లినప్పటి నుంచి ప్రత్యక్ష నరకం. అయినా బిడ్డల కోసం యజమానులు పెట్టే చిత్రహింసలు భరించింది. చివరకు భరించలేక ప్రాణాలు వదిలింది.
కష్టాల నుంచి గట్టెక్కేందుకు
హైదరాబాద్ షాహీనగర్కు చెందిన నస్రీన్ ఫాతిమా భర్త ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యింది. కష్టాల నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్లో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్న నస్రీన్ ఇద్దరు బిడ్డల్ని వదలి పరాయి దేశానికి పయనమైంది. షాహెదా అనే మహిళా ఏజెంటు, ముంబైలోని మరో ఏజెంటు సాయంతో 2017 ఆగస్టులో సౌదీ అరేబియాలోని రియాద్ నగరానికే వెళ్లింది. అక్కడ అబ్దుల్లా అనే ఓ అరబ్ షేక్ ఇంట్లో పనికి కుదిరింది.
పనిలో చేరిన నాటి నుంచి చిత్రహింసలు
పనిలో చేరిన నాటి నుంచి నస్రీన్కు వేధింపులు మొదలయ్యాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసినా యజమానులు నిత్యం నరకం చూపించే వారు. తిండి పెట్టకుండా రోజుకు 15 గంటలు పని చేయించేవారు. ఏడాదిగా జీతం కూడా ఇవ్వకపోవడంతో భారత్కు వెళ్లిపోతానని యజమానులతో చెప్పింది. అయితే వారు అందుకు నిరాకరించారు. ఈ నెల 14న చివరిసారిగా తన కుటుంబసభ్యులతో మాట్లాడిన నస్రీన్ ఫాతిమా ఈ విషయాన్ని వారికి చెప్పి ఏడ్చింది. తనను కాపాడాలని కోరింది.
సుష్మా స్వరాజ్కు లేఖ రాసిన కుటుంబసభ్యులు
ఆదివారం నస్రీన్ ఫాతిమా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన షేక్.. ఆమె అనారోగ్యంతో చనిపోయిందని చెప్పాడు. మృతదేహాన్ని హాస్పిటల్కు తరలించామని చెప్పాడు. రెండ్రోజుల క్రితం వరకు ఆరోగ్యంగా ఉన్న మనిషి ఆకస్మాత్తుగా చనిపోయిందని చెప్పడంపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫాతిమా మృతిపై విచారణ జరిపించాలంటూ ఆమె అత్త గౌసియా బేగం కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు లేఖ రాశారు.