పాకిస్తాన్లో హైదరాబాదీ మహిళకు నరకం, భర్త చేతిలో చిత్రహింసలు.. సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకున్నా...
ఇస్లామాబాద్: ఓ హైదరాబాదీ మహిళ(45) పాకిస్తాన్లో భర్త చేతిలో చిత్రహింస అనుభవిస్తోంది. ఎలాగైనా తమ కుమార్తెను హైదరాబాద్ చేర్చమంటూ ఆమె తల్లిదండ్రులు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ను కోరినా ఫలితంలేకుండా పోయింది.
సుష్మా స్వరాజ్ ఆదేశాల మేరకు పాక్లోని భారత రాయబార కార్యాలయ అధికారులు వెళ్లి కలిసినా.. బాధిత మహిళ కష్టాలు తీరలేదు. సదరు అధికారులు తిరిగి వెళ్లగానే.. భార్యను తీవ్రంగా కొట్టి ఓ గదిలో నిర్బంధించాడా దుర్మార్గుడు!
''నీ బొందిలో ప్రాణం ఉండగా.. నిన్ను భారత్కు పంపించే ప్రసక్తే లేదు. పిల్లలూ.. మీరు కూడా ఆమెకు దూరంగా ఉండండి. ఎందుకంటే.. ఆమె ఓ హిందుస్థానీ. హిందుస్థాన్లో ఉన్నవారంతా హిందువులే..'' అంటూ తన దాష్టీకం ప్రదర్శిస్తున్న ఆ ప్రబుద్ధుడి పేరు మహమ్మద్ యూనిస్. అతడి చేతిలో చిత్రహింసలు అనుభవిస్తూ.. హైదరాబాద్ రావాలని ప్రయత్నించి రాలేకపోతున్న అతడి భార్య పేరు మహమ్మదీ బేగం.
అసలేం జరిగిందంటే...
హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అక్బర్ ఓ సైకిల్ మెకానిక్. 1996లో ఒమన్కు చెందిన యూనిస్కు తన కుమార్తె మహమ్మదీ బేగంను ఇచ్చి పెళ్లిచేశాడు అక్బర్. ఓ ఏజెంట్ ద్వారా ఇద్దరికీ ఫోన్లోనే నిఖా జరిపించారు. ఆ వెంటనే భర్తతో కలిసి ఉండేందుకు మహమ్మదీ బేగం మస్కట్కు వెళ్లింది.
ఒమన్లో దాదాపు 14 ఏళ్లు గడిచిన తర్వాత ఓ రోజు.. తన భర్త పాక్ జాతీయుడని తెలియడంతో ఆమె షాక్కు గురైంది. వాస్తవం బయటపడటంతో యూనిస్ కూడా భార్యను ఒమన్ నుంచి బలవంతంగా పాకిస్తాన్కు తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి సియోల్కోట్లో భర్త, అత్తమామలు.. మహమ్మదీ బేగంను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అత్తింటి చెర నుంచి తన కూతురిని విడిపించి, భారతకు రప్పించాలంటూ గత జనవరిలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్కు ఈ-మెయిల్ ద్వారా ఆమె తండ్రి అక్బర్ విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు పాక్లో ఉంటున్న ఆమె వివరాలన్నీ పొందుపరిచాడు.
పెళ్లయిన 21 ఏళ్లలో ఆమె 2001లో ఒకే ఒక్కసారి మాత్రమే భారతకు వచ్చిందని అక్బర్ కన్నీటిపర్యంతమయ్యాడు. బాధితురాలు మహ్మదీ బేగంను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అక్బర్కు కేంద్ర మంత్రి సుష్మ కూడా హామీ ఇచ్చారు.
ఆ ప్రకారం.. మంత్రి ఆదేశాల మేరకు పాక్లో భారత రాయబార కార్యాలయ అధికారులు స్వయంగా వెళ్లి మహ్మదీబేగంను కలిశారు. ఈ సందర్భంగా తనకు భారతకు రావాలనుందనే ఆకాంక్షను ఆమె వ్యక్తం చేసింది.
మరోవైపు.. తన కూతురికి ఐదుగురు పిల్లలు ఉన్నారని మహ్మదీ బేగం తల్లి హజారా బేగం తెలిపింది. ఆమెతో పాటు పిల్లలు కూడా హైదరాబాద్ వచ్చేస్తే మరీ సంతోషమని, లేదంటే కనీసం తన కూతురినైనా వెంటనే పాక్ నుంచి ఇక్కడికి రప్పించాలని ఆమె వేడుకుంటోంది.
ఇదీ అసలు సమస్య...
ప్రస్తుతం పాకిస్తాన్లోని సియోల్కోట్లో అత్తగారింట్లో మగ్గిపోతున్న మహ్మదీ బేగం అక్కడ్నంచి బయటపడలేకపోతోంది. ఆమెను వారు ఇంటి గడప దాటనివ్వడం లేదు. ఆమె కోసం భారత అధికారులు వెళ్లినా, ఆ విషయం కూడా ఆమెకు తెలియనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చొరవతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెకు వీసా మంజూరు చేసినా ఫలితం లేకుండాపోయింది.
2017 నవంబర్ 9న మహ్మదీ బేగంకు పాక్ ప్రభుత్వం వీసా మంజూరు చేయగా 2017 డిసెంబర్ 16తో దాని గడువు కూడా ముగిసిపోయింది. వీసా గడువు ముగియడానికి రెండ్రోజుల ముందు సుష్మా స్వరాజ్ స్పందిస్తూ అవసరమైతే ఆమె స్వదేశానికి రావడానికి అవసరమైన విమాన టిక్కెట్ కొనేందుకు ఒకవేళ డబ్బే సమస్యగా మారితే, టిక్కెట్ కొనివ్వడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
మరోవైపు మహ్మదీ బేగం దీనగాథ తెలిసి పాకిస్తానీయులు కూడా అయ్యోపాపం అంటున్నారు. ఆమె ఇండియాకు చేరడానికి అవసరమైన ఖర్చను తాము భరిస్తామంటూ ముందుకొస్తున్నారు. ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. నవాబ్ ఎజాజ్ అనే మరో వ్యక్తి 'మహ్మదీ బేగంకు పాకిస్తాన్ ప్రభుత్వం సహాయం చేయాలి.. పాకిస్తానీయులు అందరూ ఆమె భర్తలాంటి వారు కాదు..' అని ట్వీట్ చేస్తూ.. పాకిస్తాన్, పంజాబ్ ప్రభుత్వాలు ఆమె క్షేమంగా భారత్ చేరేందుకు సహకారం అందించాలని కోరాడు.
మరోవైపు తమ కుమార్తెను క్షేమంగా హైదరాబాద్ చేర్చేందుకు పాక్లోని భారత రాయబార కార్యాలయం అధికారులు అవసరమైతే అక్కడి పోలీసుల సహాయం తీసుకోవాలని, ఎలాగైనా ఆమెను భర్త చెర నుంచి విడిపించి తమ వద్దకు చేర్చాలని మహ్మదీ బేగం తల్లిదండ్రులు కోరుతున్నారు.