తెలుగంటే ఎంతో ఇష్టం.. అందుకే, లండన్ ఎఫ్ఎంలో ‘స్వాతి ముత్యం- పలికితే ఆణిముత్యం’
హైదరాబాద్: ''తెలుగంటే నాకిష్టం. అందుకే లండన్ వెళ్లినా తెలుగును మరువలేదు. నా పిల్లలు కూడా తెలుగు బాగా మాట్లాడతారు..'' అని చెప్పారు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన స్వాతి.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్వాతి లండన్లో స్థిరపడ్డారు. అక్కడ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారామె. తెలుగులో పాటలు పాడడమేగాక.. లండన్ ఎఫ్ఎంలో 'స్వాతి ముత్యం- పలికితే ఆణిముత్యం' కార్యక్రమం ద్వారా తెలుగు శ్రోతలను అలరిస్తున్నారు.
ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో తన గళం విప్పే అవకాశం వచ్చిందామెకు. ఈ మేరకు స్వాతికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది.
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న స్వాతి మాట్లాడుతూ లండన్లో మన సాహితీవేత్తలను ఎంతో గౌరవిస్తుంటారని చెప్పారు. ''అక్కడ సంగీతం, నృత్యకళలకూ ఆదరణ ఎక్కువే, తెలుగు పాట పాడాలని ఇక్కడికొచ్చా.. లండన్లో ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తుంటాం.. సీఎం కేసీఆర్కి ధన్యవాదాలు..'' అని చెప్పారు.