పేలిన తూటాలు .. గాలిలో కలిసిన ప్రాణాలు .. అమెరికాలో తెలుగు దంపతుల మృతి
హైదరాబాద్ : వారిద్దరూ ఉన్నత చదువులు చదివారు. మంచి హోదాలో ఉన్నారు. అదీ కూడా అమెరికాలో .. ఏమైందో ఏమో గానీ భార్యభర్తలిద్దరూ విగతజీవులుగా మారారు. తమ పేరెంట్స్ రక్తపుమడుగులో పడి ఉండటం చూసి వారి పిల్లలు రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది.
మృతులది తెలంగాణ ..
అమెరికాలోని టెక్సాస్ లో గల టెల్ ఫేర్ ప్రాంతంలోని షుగర్ ల్యాండ్ లో శ్రీనివాస్, శాంతి దంపతులు 20 ఏళ్ల నుంచి నివసిస్తున్నారు. శ్రీనివాస్ హూస్టన్ లోని ఓ ఎనర్జీ కంపెనీ డైరెక్టర్ గా పనిచేస్తుండగా .. శాంతి కంప్యూటర్ ప్రోగ్రామర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. కొడుకు టెక్సాస్ వర్సిటీలో చదువుతుండగా .. కూతురు సెకండరీ ఎడ్యుకేషన్ అభ్యసిస్తున్నారు. టెక్సాస్ లోని ఏ అండ్ ఎం వర్సిటీలో ఎంఎస్ చదివే సమయంలో శ్రీనివాస్, శాంతికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలతో హాయిగా జీవిస్తున్నారు. ఇంతలో జరిగిన కాల్పులతో ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.
అసలేం ఏం జరిగింది ... ?
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఇంట్లోంచి కాల్పుల శబ్ధం వినిపించింది. పోలీసులు వెళ్లి చూడగా భార్యభర్తలు రక్తపుమడుగులో పడి ఉన్నారు. శాంతి తలలో, శ్రీనివాస్ ఛాతీలో తూటాలు ఉన్నాయి. శాంతిని కాల్చి .. శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో వారి కుమారుడు వర్సిటీలో క్లాసులకు హాజరయ్యాడు. కూతురు మాత్రం పక్కనే గల తన బెడ్ రూంలో పడుకొని ఉంది. కాల్పులతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన ఆమె ... ఎంత పిలిచినా లోపల ఉన్న మమ్మీ, డాడీ స్పందించడం లేదు .. బెడ్ రూం నుంచి బయటకు రావడం లేదు అని ఆందోళనతో పోలీసులతో చెప్పింది.
ఓయూలో చదివిన శాంతి
హైదరాబాద్ లోని ఉస్మానియా వర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్ విభాగంలో బీఈ చేశారు శాంతి. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్ లోని ఏ అండ్ ఎం వర్సిటీలో ఎంఎస్ పూర్తిచేశారు. ప్రస్తుతం యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో కంప్యూటరింగ్ విభాగంలో ప్రాజెక్టు లీడర్ కమ్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నారు. తనకు మూగజీవుల సంక్షేమం, పర్యావరణం, సాంకేతిక విషయాల పల్ల ఆసక్తి ఉందని తన లింక్ డిన్ పేజీలో శాంతి రాసుకున్నారు. ఇటు శ్రీనివాస్ స్వస్థలం కూడా హైదరాబాదే. ఆయన కూడా ఏఅండ్ఎమ్ వర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.