భారతీయుడిపై దాడి: నిందితుడికి బెయిల్
భారతీయ విద్యార్థిపై దాడికి పాల్పడిన మరో నిందితుడ్ని(17) పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న ఒక రోజు తర్వాత తొలుత అరెస్ట్ చేసిన నిందితునికి బెయిల్ లభించింది. కాగా ఆస్ట్రేలియాలో ఇటీవల దుండగులు జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలైన భారతీయ విద్యార్థి మన్రియాజ్విందర్ సింగ్ (20) పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.
డిసెంబర్ 29న తన స్నేహితుడితో కలిసి మన్రియాజ్విందర్ సింగ్ ఫుట్పాత్పై నిలబడి ఉండగా, 8 మంది దుండగులు వచ్చి దాడి చేశారు. ఇద్దరినీ కూడా తీవ్రంగా కొట్టి వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కుని వెళ్లారు. ఆ దాడికి సంబంధించి సిసిటివీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు తొలుత ఒక నిందితున్ని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కూడా పట్టుబడటంతో తొలుత అరెస్ట్ చేసిన నిందితునికి షరతులతో కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది.
దుండగులు అఫ్రికావాళ్ల మాదిరిగా ఉన్నారని, ఓ కాకేసియన్ మహిళ కూడా వారిలో ఉందని డిటెక్టివ్ సీనియర్ పోలీసు అధికారి ఇటీవల మీడియాకు తెలిపారు. మన్రియాజ్విందర్ సింగ్ దవడలపై గట్టిగా గుద్దారని, దాంతో వెనక్కి పడిపోయి స్పృహ కోల్పోయాడని చెప్పారు. కిందపడిన తర్వాత కూడా వారు అతన్ని వదిలిపెట్టలేదని, తన్నుతూ కొట్టారని, మహిళ కర్ర తీసుకుని దాడి చేసిందని చెప్పారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మన్రియాజ్విందర్ సింగ్ కోమాలోకి వెళ్లిపోయాడు. మరో స్నేహితునికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.