బ్యాటుతో కొట్టి కూతురుపై చిత్రహింసలు: పేరెంట్స్ అరెస్ట్
న్యూయార్క్: తమ కూతురు(12)ను అసభ్యమైన పదజాలంతో దూషించడంతోపాటు బేస్బాల్ బ్యాటుతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన నేరం కింద భారతీయ దంపతులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లిదండ్రుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. బాలికకు వైద్యులు హుటాహుటిన వైద్యం అందించారు. బాలిక అనారోగ్యంగా, తీవ్ర బలహీనంగా ఉందని వైద్యులు తెలిపారు.
గత కొంత కాలంగా బాలికను నిర్బంధించి తీవ్రంగా గాయపర్చిన రాజేష్ రానోత్(46), అతని భార్య శీతల్ రానోత్(31)లపై క్వీన్స్ క్రిమినల్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి. నిందితులు బాలికను తీవ్రంగా హింసించారని క్వీన్స్ జిల్లా అటార్నీ రిచర్డ్ బ్రౌన్ తెలిపారు.
డిసెంబర్ 2012 నుంచి మే 2014 మధ్య కాలంలో బాలికకు సరైన దుస్తులు, ఆహారం కూడా ఇవ్వకుండా గదిలో బంధించిన శీతల్ రానోత్, బాలిక ముఖంపై శరీరంపై తీవ్రంగా కొట్టింది. మే 2013లో ఓసారి పిచ్చిపట్టినదానిలా బాలికపై విరుచుకుపడిన శీతల్.. బాలికను ఇనుప రాడ్డుతో తీవ్రంగా గాయపర్చింది. దీంతో బాలిక చేతులు, కాళ్ల వెంట రక్తం కారింది. ఈ విషయం న్యూయార్క్ సిటి బాలల రక్షణ సంస్థకు తెలిసింది. దీంతో వారు బాలిక తల్లిదండ్రులపై క్రిమినల్ అభియోగాలతో కోర్టులో పిటిషన్ వేశారు.
బాధిత బాలిక మాయ రానోత్కు సవతి తల్లి అయిన శీతల్ ప్రస్తుతం జైల్లో ఉంది. 60,000 డాలర్లు చెల్లిస్తే బెయిల్ వస్తుంది. కానీ దోషిగా తేలితో ఆమెకు 33 సంవత్సరాల జైలు శిక్ష పడనుంది. కాగా, బాలిక కన్న తండ్రి అయిన రాజేష్ కూడా జైలులోనే ఉన్నారు. 25,000 డాలర్లు చెల్లిస్తే బెయిల్ లభించనుంది. నేరం రుజువైతే ఇతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్షపడే అవకాశం ఉంది. తదుపరి విచారణను ఆగస్టు 13కు కోర్టు వాయిదా వేసింది.