మరో భారతీయుడి హత్య: కెనడాలో ఇంట్లోకొచ్చి కాల్చి చంపిన దుండగులు
టొరంటో: మరో ప్రవాస భారతీయుడు హత్యకు గురయ్యాడు. కెనడాలోని బ్రాంప్టన్ నగరంలోని తన స్వగృహంలోనే భారత సంతతికి చెందిన 27 యువకుడ్ని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
శరత్ హంతకుడిని కాల్చిచంపిన అమెరికా పోలీసులు, నల్లజాతీయుల నిరసనలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనదేశానికి చెందిన పల్విందర్ సింగ్ 2009లో ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లాడు. బ్రాంప్టన్ నగరంలో నివాసం ఉంటున్న పల్విందర్ ట్రక్కు డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం నలుగురు గుర్తు తెలియని దుండగులు పల్విందర్ ఇంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు.
ఈ హత్య కేసులో నిందితులైన మిస్సిస్సౌగాకు చెందిన 18, 19ఏళ్ల యువకులిద్దరూ లొంగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. పల్విందర్ మృతిపై ఆయన స్నేహితుడొకరు కన్నీటిపర్యాంతమయ్యారు. మరో రెండు రోజుల్లో పల్విందర్ పుట్టినరోజు వేడుకలో చేసుకోవాల్సి ఉండగా.. ఇలా జరగడం ఘోరమని కంటతడిపెట్టాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు.
కాగా, ఈ ఏడాది బ్రాంప్టన్లో చోటు చేసుకున్న 11వ హత్య అని, తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని వలసదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలావుంటే, ఇటీవల తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శరత్ కొప్పు(25) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిందితుడ్ని పోలీసులు కాల్చి చంపేశారు.