భారతీయుడిపై కాల్పులు: తీవ్రగాయాలు
మనీలా: భారత సంతతికి చెందిన ఓ యువకుడిపై సాయుధులైన ఇద్దరు దుండగులు బైకుపై వెళుతూ తుపాకులతో కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన ఫిలిప్పీన్స్లోని జంబోంగ నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. రెండు సార్లు కాల్పులు జరపడంతో అతడి తలకు, శరీరానికి బుల్లెట్ల గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
సుఖ్జిందర్ సింగ్(28) తన ఇంటి నుంచి కజిన్ ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, గత సంవత్సరంలో కూడా ఆ ఇద్దరు ఫిలిపినో దొంగలు జంబోంగాలో ఓ చిన్న వ్యాపారం చేసుకుంటున్న భారత వ్యాపారి హర్పీత్పై దాడి చేశారని పోలీసులు తెలిపారు.
కాగా, 2012, అక్టోబర్లో తావి తావి ప్రావీన్స్ నుంచి వచ్చిన ఐదుగురు భారతీయులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద పాస్పోర్టులు లేవని, వారి వద్ద ఉన్నవి కేవలం నకిలీ లేబర్ పర్మిట్లు మాత్రమేనని చెప్పారు.
జంబోంగాలో స్థిరపడిన చాలా మంది భారతీయులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. మరికొంత మంది స్థానిక యువతులను వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడిపోయారని చెప్పారు.