బ్రిటన్ పార్లమెంటులో తొలి భారత సంతతి ముస్లిం మహిళా మంత్రి ప్రసంగం
లండన్: బ్రిటన్ పార్లమెంటు డిస్పాచ్ బాక్స్ నుంచి భారత సంతతికి చెందిన తొలి ముస్లిం మహిళా యూకే మంత్రి నస్ ఘని ప్రసంగించనున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి బర్మింగ్హమ్కు వలసవెళ్లిన నస్ ఘని కుటుంబం అక్కడే స్థిరపడింది. నస్ ఘని కూడా ఇక్కడే జన్మించారు.
జూనియర్ రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నస్ ఘని శుక్రవారం హౌస్ ఆఫ్ కామన్స్లో ఇతర సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య తన ప్రసంగాన్ని చేయనున్నారు. బ్రిటన్ పార్లమెంటులో తాను తొలి ముస్లిం మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు ఎంతో ఆనందంగా ఉందని నస్ ఘని తెలిపారు.
వియల్డన్ నుంచి ఎంపీగా ఎన్నికైన తాను కొత్తగా వచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. గత వారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రధానమంత్రి థెరీసా మే తన మంత్రివర్గంలోకి ఈ 45ఏళ్ల నస్ ఘనిని కూడా తీసుకున్నారు.
కాగా, ఘనీకి మంత్రి పదవి దక్కడం పట్ల మిగితా సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఏజ్ యూకే, బ్రేక్ త్రూ బ్రేస్ట్ క్యాన్సర్ లాంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఘనీ గతంలో పనిచేశారు. కన్జర్వేటివ్ పార్టీ నుంచి 2015లో గెలుపొందిన నస్ ఘని.. తొలి ముస్లిం మహిళగా రికార్డు సృష్టించారు.