బెదిరింపు: అమెరికా నుంచి భారత విద్యార్థి బహిష్కరణ
హూస్టన్: ఉన్నత విద్యకోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యాడు. సామాజిక నెట్వర్క్ వెబ్సైట్లు యూట్యూబ్, గూగుల్ ఫ్లస్లలో మహిళలను హత్యచేస్తానని బెదిరింపులతో కూడిన వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.
సియాటెల్లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం విద్యార్థి కేశవ్ ముకుంద్ భిడే(24) మహిళలను హత్యచేస్తానని ఆన్లైన్లో బెదిరింపు వ్యాఖ్యలు చేశాడు. నిరుడు మేలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి సమీపంలోని శాంతా బార్బరా వద్ద ఆరుగురు విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. తనకు తాను కాల్చుకుని చనిపోయిన రోడ్గేర్ చేసిందంతా న్యాయబద్ధమేనని తన యూట్యూబ్ ఖాతాలో ముకుంద్ భిడే పేర్కొన్నాడని పోలీసులు తేల్చారు.
ఈ క్రమంలో ఆన్లైన్లో ఇతరులతో చాటింగ్ నిర్వహించిన భిడే.. తన పేరు చెప్పాలని వారు అడిగినప్పుడు ‘నేను సియాటెల్లో నివసిస్తున్నా.. వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి వెళ్లా, నేను మీకిచ్చే సమాచారం ఇదే. నేను మహిళలను మాత్రమే హత్యచేస్తా. ఇలియట్ చేసిందానికంటే మరింత చేస్తా' అని భిడే వ్యాఖ్యానించాడు.
ఆయన వ్యాఖ్యలపై దర్యాప్తునకు వెళ్లిన ఎఫ్బీఐ అధికారులతోనూ అతడు దురుసుగా ప్రవర్తించాడు. భిడేను అమెరికా ఎఫ్బీఐ అధికారులు డిసెంబర్ నెలలోనే భారత్కు పంపివేశారు. అతడి విద్యార్థి, సందర్శక వీసాను రద్దుచేస్తూ అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇమ్మిగ్రేషన్ జారీచేసిన ఆదేశాలను వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ధృవీకరించింది. పదేళ్లలో తమదేశంలో అడుగుపెడితే భిడేపై అభియోగాలు నమోదుచేస్తామని హెచ్చరించారు.