విషాదం: సెల్ఫీ తీసుసుకుంటూ ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి మృతి
మెల్బోర్న్: విహారయాత్ర విషాదంగా ముగిసింది. సరదాగా గడపాలని స్నేహితులతో విహారయాత్రకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటూ సముద్రంలోకి జారిపడి భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమ ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆల్బనీలోని పోర్ట్టౌన్ వద్ద 40 మీటర్ల ఎత్తైన, నిటారుగా ఉన్న ఓ రాయి మీద నుంచి సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్లో చదువుకుంటోన్న భారతీయ విద్యార్థి అంకిత్(20)..స్నేహితులతో కలిసి పోర్ట్ టౌన్కు వెళ్లాడు.
సెల్ఫీ కోసం అందరూ అక్కడున్న రాళ్లమీదకి చేరారు. అయితే అంకిత్ కాలు జారి ఒక్కసారిగా సముద్రంలో పడిపోయాడు. 'అతడు జాగ్రత్తగా ఫోటోలు దిగాడు. కానీ కాలు జారడం వల్లే ఇలా జరిగింది' అని అంకిత్ స్నేహితుడు తెలిపాడు.
సముద్రం నుంచి విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీసి కుటుంబసభ్యులకు సమాచారమందించారు. అంకిత్ మరణ వార్త విని అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని, ఈ ప్రమాకరమైన ప్రాంతానికి వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పోలీసులు తెలిపారు.