లక్కీ డ్రా: 20 కిలోల గోల్డ్ గెల్చుకున్న ఎన్నారై యువతి
దుబాయ్: ఓ ప్రవాస భారతీయ మహిళపై దుబాయ్ లక్కీ డ్రా కనకవర్షం కురిపించింది. కేరళలో పుట్టి కెన్యాలో పెరిగిన అన్న్ అనే 25ఏళ్ల మహిళ దుబాయ్లో ఇంజినీర్గా పనిచేస్తున్నారు. మెగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆమెకు 20 కేజీల బంగారం గెలుచుకున్నట్లు నిర్వాహకులు గురువారం ఫోన్ చేసి చెప్పారు.
లక్కీ డ్రా విలువ రూ.5 కోట్లు వరకు ఉంటుంది. బహుమతి గెలువడంపై ఆమె స్పందిస్తూ.. 'నా 25వ పుట్టినరోజు సందర్భంగా పట్టగొలుసులు కొనుక్కున్నాను. అదికూడా బేరమాడి తీసుకున్నాను' అని చెప్పారు. ఇంత పెద్ద లాటరీ గెలువడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
‘నేను ప్రతీసారి నా తండ్రికి ఓ పెద్ద కారు కొనాలని ఈ లాటరీ టికెట్ తీసుకుంటాను. ఈసారి నాకు లాటరీ తగిలింది. దీంతో కెన్యాలో ఉన్న నా తండ్రికి ఓ పెద్ద కారు బహుమతిగా ఇస్తా' అని ఆ యువతి పేర్కొన్నారు. ‘నా తల్లిని ఏ బహుమతి ఇవ్వాలని అడిగితే.. ఆమె నేను సంతోషంగా ఉంటే చాలు అని అంది' అని అన్న్ తెలిపారు.
ఇంత భారీ మొత్తంలో సొత్తు వచ్చినప్పటికీ తనకు ఏమాత్రం గర్వం లేదని, తన పాదాలు నేలపైనే ఉంటాయని తెలిపారు. తన ఉద్యోగాన్ని కొనసాగిస్తానని చెప్పారు. కాగా, ఈ వారంలో బహుమతిని విజేతకు అందజేస్తామని మెగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వాహకులు గల్ఫ్ న్యూస్కు తెలిపారు.