అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య
వాషింగ్టన్: అమెరికా ఒహియోలోని ఓ మాల్లో పనిచేస్తున్న తెలుగు వ్యక్తి ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. వారం క్రితం జరిగిన ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి, అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు.
మతుడు కరీంనగర్ జిల్లాకు చెందిన కరేంగ్లే కరుణాకర్(53). కరుణాకర్కు భార్య విజయ, కుమారుడు అనికేత్ ఉన్నారు. ప్రస్తుతం వీరు కరీంనగర్లోనే నివాసముంటుండగా కరుణాకర్ ఒక్కడే ఒహియాలోని ఫెయిర్ఫీల్డ్లో నివసిస్తున్నాడు.
డిసెంబర్ 4న రాత్రి 10 గంటల ప్రాంతంలో సిన్సినాటిలోని డిక్సీ హైవేలో ఉన్న కారుణాకర్ పనిచేస్తోన్న జీఫ్ఫీ మార్ట్కు ఇద్దరు దుండగులు వచ్చారు. వస్తూనే కాల్పులు ప్రారంభించారు.
అనంతరం క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బు దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనలో బుల్లెట్లు తగిలి తీవ్రంగా కరుణాకర్ తీవ్రంగా గాయపడగా, అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి డిసెంబర్ 8న కరుణాకర్ మృతి చెందాడు. అతడిపై కాల్పులు జరిపిన దుండగుల ఆచూకీ కోసం ఫెయిర్ఫీల్డ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కరుణాకర్ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
మృతుడు కారుణాకర్ భార్య, పిల్లాడిని ఆదుకునేందుకు అతడి బావమరిది మహేష్ ఆన్లైన్ ఫండ్ రైజింగ్ వెబ్సైట్ అయిన 'గో ఫండ్ మి డాట్కాం' ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు.