తానా మహాసభలకు కేటీఆర్కు ఆహ్వానం
జులై 4 నుంచి 6 వరకు అమెరికాలో 22వ తానా సభలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం వాషింగ్టన్ డీసీలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మూడు రోజుల పాటు సాగే మహాసభలకు హాజరుకావాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఇన్విటేషన్ అందింది. తానా అధ్యక్షుడు సతీశ్ వేమన, ఇతర ప్రతినిధులు ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కేటీఆర్తో పాటు మంత్రి ఎర్రబెల్లిని మహాసభలకు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎర్రబెల్లి ప్రేమ్ చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
తానా మహాసభల్లో అందరినీ భాగస్వాముల్ని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యూజెర్సీ, ఆస్టిన్, హ్యూస్టన్, డల్లాస్, డెట్రాయిట్, కొలంబస్, ఫిలడెల్ఫియా, మేరీలాండ్ నగరాల్లో ఇప్పటికే ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. తానా అధ్యక్షుడు సతీష్ వేమన, కాన్ఫరెన్స్ ఛైర్మన్ నరేన్ కొడాలి, ఫండ్ రైజింగ్ కమిటీ ఛైర్మన్ రవి మందలపుతో పాటు పలువురు ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
మూడు రోజుల పాటు జరిగే సభలకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తానా ప్రతినిధులు కోరారు. ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా తెలుగుభాష, సంస్కృతికి తానా చేస్తున్న సేవలను వివరిస్తున్నారు. తానా క్యూరీ ఆధ్వర్యంలో చిన్నారులకు సైన్స్, గణితం, స్పెల్ బీ పోటీలు నిర్వహించి వారి ప్రతిభకు పదను పెట్టనున్నారు. తెలుగు భాషకు సంబంధించి పలు పోటీలతో పాటు వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. త్వరలో మరిన్ని నగరాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తానా ప్రతినిధులు చెప్పారు.