కువైట్లో అనధికార నివాసులకు అమ్నెస్టీ: తెలుగువారి క్యూ
హైదరాబాద్: కువైట్లో అనధికారికంగా నివాసముంటున్న విదేశీయులు ఆ దేశం విడిచి వెళ్ళటానికి కువైట్ ప్రభుత్వం ఆమ్నెస్టీని ప్రసాదించింది. జనవరి 29 నుండి అమలులోకి వచ్చి నెల రోజులపాటు అమలులో వుంటుంది.
2011 తరువాత అంటే ఏడేళ్ల తరువాత వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవటానికి ఎంతోమంది భారతీయులు అందులోను తెలుగువారు ముందుకొస్తున్నారు. మొదటిరోజునే ఎంతోమంది తెలుగువారు భారత రాయబార కార్యాలయంవద్ద క్యూ కట్టారు.
కువైట్లోవున్న 47 తెలుగు సంఘాల వారు ముందుకువచ్చి ఈ అవకాశాన్ని వాడుకోదలచిన తెలుగువారికి అన్నివిధాల సహాయపడుతున్నారు. తెలుగు సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ కుదరవల్లి సుధాకర రావు ఆంధ్రప్రదేశ్ గౌరవముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తూ అంధ్రప్రదేశ్ తిరిగిరానున్న తెలుగువారిని అన్నివిదాలా ఆదుకోవాలని, వారికి కువైట్ నుండి ఇండియాకి విమాన టిక్కెట్టు, విమానాశ్రయం నుండి వారి ఇంటివరకు ఉచిత రవాణా సదుపాయాన్ని కలిపించాలని కోరారు.
అందుకు తగినవిదముగా ప్రత్యేక బడ్జెట్ను కేటాయించవలసినదిగా వినతి పత్రాన్ని పంపించారు. ఇదే విషయాన్ని అంధ్రప్రదేశ్ ప్రవాస మంత్రి కొల్లు రవీంద్ర కువైట్లో భారత రాయబారి జీవసాగర్, ఏ.పి.ఎన్.అర్.టి. అధ్యక్షులు రవి వేమురు దృష్టికి తీసుకు వెళ్ళారు.
ఐక్య వేదిక కో-కన్వీనర్ కొత్తపల్లి మోహన్ బాబు - జజీరా విమానయాన సంస్థతో సంప్రతింపులు జరుపుతూ ప్రతిరోజు హైదరాబాదుకు వస్తున్న విమానంలొ అన్నిసీట్లు వీరికోసం కేటాయించవలసినదిగా, ప్రతేక పాకెజిని ఇవ్వ వలసినదిగా కోరుతున్నారు.