మీ కోసం యువత ఎదురుచూపు: లోకేష్ను కలిసిన కువైట్ టీడీపీ అధ్యక్షుడు
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ను తెలుగుదేశం పార్టీ కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు తదితరులు కలిశారు. లోకేష్తో పాటు ఎమ్మెల్సీలు టీజీ జనార్ధన్, వీవీ చౌదరి, షరీఫ్, హిదాయత్లను కలిశారు.
వీరు పార్టీ కార్యకలాపాల గురించి చర్చించారు. గల్ఫ్ దేశాలలో చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. నారా లోకేష్ను గల్ఫ్ దేశాలకు ఆహ్వానించారు. లోకేష్ రాక కోసం యువత ఎదురు చూస్తోందని ఆయనకు తెలిపారు.
కువైట్లో మైనార్టీ సభ
కువైట్లో మైనార్టీ సభ జరపడానికి అనుమతి కోరుతూ మైనార్టీ నాయకులను పంపవలసిందింగా విజ్ఞప్తి చేశారు. ఆగస్టులో ఈ సభ జరపడానికి అంగీకరించారు. పలువురు మైనార్టీ నేతలను పంపించేందుకు పార్టీ ముఖ్య నేతలు అంగీకరించారు.
తెలుగువారికి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా గల్భ్లో నివసిస్తున్న తెలుగువారికి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా సుధాకర్ రావు వివరించారు.
త్వరలో కువైట్ తెలుగు మహాసభలు
తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో కువైట్ తెలుగు మహాసభలు త్వరలో నిర్వహించతలపెట్టినట్లు మంత్రికి తెలిపారు.
ప్రవాసాంధ్రులకు టీడీపీ ప్రభుత్వ పథకాలు
ఏపీఎన్ఆర్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల కోసం ప్రవేశపెట్టిన బీమా పథకాన్ని, ఇతర ఎన్టీఆర్ కార్యక్రమాల గురించి వారు చర్చించారు.
2019 ఎన్నికల కోసం ప్రచారం
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అన్ని జిల్లాలకు చెందిన వారు కువైట్ నుంచి వచ్చి ప్రచార కార్యక్రమాలు పాల్గొనాలని నిర్ణయించారు.
గల్ఫ్ దేశాలకు టీడీపీ కార్యక్రమాలు విస్తృతం చేయాలి
గల్ఫ్లో ఉన్న అన్ని దేశాలలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అర్బన్ అధికార ప్రతినిధి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.