ఎన్నారై మృతి: అనుమానాలు
అనిల్ ఆత్మహత్యపై విచారణ జరిపించాలని ఒమన్లోని భారత కార్యాలయాన్ని కోరిన అనంతరం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. గొంతు కోసుకుని అనిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మేలా లేదని ఆయన తెలిపారు. ప్రజలు ఎన్నో విధాలుగా ఆత్మహత్య చేసుకున్నారని, అయితే గొంతుకోసుకుని ఎవరూ ఆత్మహత్య చేసుకోలేరని ఆయన చెప్పారు. ఇది సాధ్యమయ్యేలా ఉందా అని ప్రసాద్ ప్రశ్నించారు. అందుకే తాను భారత రాయబార కార్యాలయాన్ని ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరానని తెలిపారు.
ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ.. జనవరి 2న ఒమన్లోని భారత రాయబార కార్యాలయంలో ప్రసాద్ ఒక అభ్యర్థనను అందజేశారు. అనిల్ కుమార్ తన ఫోన్ కాల్స్ను స్వీకరించడం లేదని తన సోదరి చెప్పడంతో తాను ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ప్రసాద్ తెలిపారు. ఘటనా స్థలంలో అనుమానాస్పద స్థితిలో అనిల్ కుమార్ చనిపోయి ఉన్నాడని చెప్పారు. అనిల్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవని తెలిపారు.
అనిల్ కుమార్ ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బును రెగ్యూలర్గా ఇంటికి పంపిస్తున్నాడని చెప్పారు. అనిల్ కుమార్ ఒమన్లోని బర్కా సమీపంలో ఓ కంపెనీలో ఐదు నెలలుగా డ్రిల్లర్గా విధులు నిర్వహిస్తున్నాడని ప్రసాద్ చెప్పారు. కాగా అనిల్ కుమార్ ఆత్మహత్య ఘటనతో అతని గదిలో ఉండే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు, ఆ తర్వాత అతన్ని విడిచిపెట్టారు.