సాయంత్రమే మాట్లాడాడు.. రాత్రికల్లా..., ఆదిలోనే చితికిన ఆదినారాయణరెడ్డి ఆశలు..
నల్గొండ: నిరుపేద రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ అతడు జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంతో బాగా చదివి ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు.. కానీ అతడి ఆశలు ఆదిలోనే చితికిపోయాయి.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడెంకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి కోన ఆదినారాయణరెడ్డి ఆస్ట్రేలియాలో ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.
కుటుంబాన్ని తీసుకెళ్లే సన్నాహాల్లో...
హైదరాబాద్లోని ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్న కోన ఆదినారాయణ రెడ్డిని ఆర్నెల్ల క్రితమే కంపెనీ వారు సిడ్నీకి పంపారు. కవల పిల్లలైన ఆధ్య, ఆరాధ్యలతో భార్య శిరీషకు కష్టమవుతుందని భావించినప్పటికీ మొదట ఒక్కడే ఆస్ట్రేలియా వెళ్లాడు. మరో నెలరోజుల్లో భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలను తీసుకుని ఆస్ట్రేలియా వెళ్లేందుకు అతడు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు.
సాయంత్రమే మాట్లాడాడు...
ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆదినారాయణ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి భార్యకు ఫోన్ చేశాడు. ‘‘ఆధ్య, ఆరాధ్య ఎలా ఉన్నారు?'' అంటూ వాకబు చేశాడు. ‘‘అల్లరి చేస్తారు.. కొట్టకు.. నెల రోజుల్లో మీరు ఇక్కడికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశా..''అంటూ భరోసా కల్పించాడు.
భార్య ఫోన్ చేసినా...
సాయంత్రమే భర్త ఆదినారాయణ రెడ్డి మాట్లాడినా.. సిడ్నీలో వాతావరణం ఎలా ఉంటుందో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో కనుక్కుందామని అతడి భార్య శిరీష తిరిగి రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసింది. రింగ్ అవుతున్నా అతడు ఫోన్ ఎత్తలేదు. ఆ రాత్రి శిరీష పలుమార్లు భర్తకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది.
భర్త స్నేహితుడికి సమాచారం...
సోమవారం కూడా శిరీష భర్తకు ఫోన్ చేసింది. అయినా ఆదినారాయణ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానం లేదు. దీంతో కీడు శంకించిన శిరీష ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నివాసముంటున్న ఆదినారాయణ రెడ్డి స్నేహితుడైన రామ్ కుమార్కు ఫోన్ చేసి విషయం విరించింది. అతడు తన స్నేహితులను ఆదినారాయణ రెడ్డి నివాసానికి పంపి చూడగా, అప్పటికే అతడు గదిలో విగతజీవుడై కనిపించాడు.
చివరి చూపైనా దక్కుతుందో లేదో?
ప్రస్తుతం శిరీష తన భర్త చివరి చూపైనా దక్కుతుందో లేదో అని గుండెలవిసేలా రోదిస్తోంది. ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో తెలియక.. ఏం చేయాలో..? ఎవరిని అడిగి సమాచారం తెలుసుకోవాలో అర్థంకాక దీనంగా రోదిస్తున్న తీరు చూపరుల్ని కంటతడి పెట్టిస్తోంది. తన భర్త పనిచేస్తోన్న కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని శిరీష ఆవేదనగా వ్యక్తం చేసింది. తన భర్త మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వమైనా తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె వేడుకుంటోంది.