అసత్య కథనాలు, పరువునష్టం: కెనడాలో నష్టపరిహారంగా ఎన్నారైకు రూ.8.4 కోట్లు
టోరంటో: పరువు నష్టం దావా కేసులో కెనడాలోని ఓ భారత సంతతి వ్యాపారికి దాదాపు రూ.8.4 కోట్లు నష్టపరిహారంగా వచ్చింది. సదరు ఇండో - కెనడియన్ వ్యాపారవేత్త పేరు అల్తాఫ్ నజరేలి. ఇతను గుజరాత్ రాష్ట్రంలోని భుజ్కు చెందినవాడు. అతను కెనడాలోని వాంకోవర్లో ఉంటున్నాడు.
అక్కడ వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. తనపై వరుస అశత్య కథనాలు ఇచ్చారంటూ అమెరికన్ బ్లాక్ చైన్ ఇన్వెస్టర్ ఓవర్ స్టాక్.కామ్ సీఈవో పాట్రిక్ బైర్న్ పైన పరువు నష్టం దావా వేశారు. తన ఖ్యాతిని దెబ్బతీసేలా ప్రచారం చేశారని పేర్కొన్నారు.
ఈ కేసులో వాదనలు విన్న కెనడా అత్యున్నత న్యాయస్థానం ప్యాట్రిక్ బైర్న్ వాదనలను తోసిపుచ్చింది. నజరేలికి 1.2 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
కెనడాలో ఇలా నష్టపరిహారం కింద ఇంత పెద్ద మొత్తం రావడం ఇదే. నజరేలి ఏడేళ్ల పాటు న్యాయపోరాటం చేసి గెలిచాడు. 2011లో అమెరికన్ వెబ్ సైట్ ఒకటి ప్రచురించిన కథనాలపై న్యాయపోరాటం ప్రారంభించాడు.
ఈ కథనాలలో తనను మాదకద్రవ్యాలు అక్రమరవాణా చేసేవాడిగా, ఆయుధాలు సరఫరా చేసే డీలర్గా, గ్యాంగ్స్టర్గా, అల్ ఖైదాకు ఆర్థిక సాయం చేసేవాడిగా చిత్రీకరించారని చెప్పారు. ఆ కథనాలు మార్క్ మిచెల్ రాశారు. ప్యాట్రిక్ బైర్న్కు చెందిన వెబా సైట్ పబ్లిష్ చేసింది. దీనిపై కోర్టుకు వెళ్లారు నజరేలి.