డిజిటల్ పద్ధతిలో ఘనంగా ఉగాది వేడుకలు జరుపుకున్న స్కాట్లాండ్ తెలుగు ప్రజలు
కరోనావైరస్ ప్రపంచాన్ని మొత్తం కబళిస్తోంది. కరోనావైరస్ బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అంతేకాదు కొన్ని లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారీ స్వైరవిహారం చేస్తుండటంతో మనిషి జీవితమే తలకిందులైంది. ప్రపంచదేశాలు లాక్డౌన్లోకి వెళ్లడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పండగలు లేవు పబ్బాలు లేవు.. అయినప్పటికీ ఇళ్లల్లోనే ఉంటూ పండగవేళ సోషల్ మీడియా ద్వారా తమ సన్నిహితులకు, బంధువులకు టచ్లోకి వస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా స్కాట్లాండ్లోని తెలుగు సంఘం వారు కూడా ఉగాది పర్వ దినాన్ని డిజిటల్ పద్ధతిలో జరుపుకున్నారు.
స్కాట్లాండ్ దేశం లాక్డౌన్లో ఉన్నప్పటికీ అక్కడ ఉన్న మన తెలుగు వారు మాత్రం పండగ ఫ్లేవర్ ఎక్కడా తగ్గకుండా ఇళ్లకే పరిమితమై ఘనంగా జరుపుకున్నారు. టెక్నాలజీని వినియోగించి ఈ శార్వరీ నామ సంవత్సరాన్ని డిజిటల్ పద్ధతిలో ఆహ్వానించారు. ఈ విపత్కర సమయాల్లో స్కాట్లాండ్లో నివసిస్తున్న తెలుగు ప్రజల్లో సోషల్ మీడియా ద్వారా పండగ వేడుకలను టెలికాస్ట్ చేసి వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. విపత్కర సమయాల్లో కూడా పండగ శోభను కళ్లకు కట్టారు.
డిజిటల్ పద్దతిలో జరిగిన ఈ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించింది స్కాట్లాండ్ తెలుగు సంఘం (TAS). స్కాట్లాండ్లో తెలుగు ప్రజలు తమకు నచ్చిన సంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, భరతనాట్యంతో పాటు పలు సినిమా పాటలకు కూడా కాలు కదిపారు. స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు. అంతేకాదు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. చిన్నారుల ఆటపాటలతో పండగను మరో లెవెల్కు తీసుకెళ్లింది స్కాట్లాండ్ తెలుగు సంఘం. చిన్నారులు పద్యాలను పాడటం, గేయాలు చెప్పడం ఆకట్టుకుంది. స్కాట్లాండ్లో ఉంటున్నప్పటికీ తెలుగు మీద ఏమాత్రం మక్కువ తగ్గలేదని, పిల్లలకు తెలుగు నేర్పుతున్నట్లు చెప్పారు. ఇక వీటన్నిటినీ వీడియోలుగా తయారు చేసి టాస్కు పంపడం జరిగింది. అందరికీ శార్వరీనామా సంవత్సర శుభాకాంక్షలు వీడియో సందేశం ద్వారా పంపడం జరిగింది.
ఇక ఈ కార్యక్రమాలన్నిటినీ టాస్ ఫేస్బుక్ గ్రూప్లో ప్రతి అరగంటకు ఒక వీడియోను పబ్లిష్ చేస్తూ రోజంతా పండగ ఫ్లేవర్ను కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు ఉదయ్ కుమార్ కూచడి. అనంతరం టాస్ మాజీ ఛైర్మెన్ సత్య శ్యామ్ కుమార్ జయంతి కొత్త టాస్ అధికారిక కార్యవర్గాన్ని ప్రకటించారు. వీరంతా 2020-22 వరకు కొనసాగుతారు. చివరిగా కొత్త కార్యదర్శులు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడంతో శార్వరీ నామ సంవత్సర వేడుకలు ఘనంగా ముగిసినట్లు టాస్ వెల్లడించింది.