ప్రవాస భారతీయుల్లోనూ కౌంటింగ్ టెన్షన్ : భారీగా ఈవెంట్ల నిర్వహణ, బీర్లు, బిర్యానీలతో ఆకట్టుకునే యత్నం
న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో జరిగిన ఓట్ల లెక్కింపు నరాలు తెగే ఉత్కంఠ కలిగిస్తోంది. దాదాపు 90 కోట్ల మంది ఓటర్లున్న దేశంలో 542 లోక్సభ స్థానాలకు ఏడు విడుతల్లో ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇటు ఏపీ సహా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించింది. వయోజనులు నిక్షిప్తం చేసిన ఓట్లను మరికొన్ని గంటల్లో సిబ్బంది లెక్కించనున్నారు. వాస్తవానికి రాజకీయ పార్టీలు, నేతలు, శ్రేణులు, కార్యకర్తలు, ప్రజల్లో ఏ పార్టీ గెలుస్తోంది ? ఎవరు అధికారం చేపడుతారు అనే టెన్షన్ ఉంటుంది. కానీ ఈసారి ఖండాంతరాల్లోనూ భారత్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిశితంగా గమనిస్తోంది. ఇందుకోసం ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు.
ఆస్ట్రేలియాలో ఇలా ..
దేశంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఆస్ట్రేలియాలోని ప్రవాసులు కళ్లప్పగించి చూసేందుకు సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో లెక్కింపు ప్రారంభం అవుతుండగా ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి శనివారమో, ఆదివారమో అయితే విదేశాల్లో జరిగే ఈవెంట్లకు క్రేజీ ఉంటుంది. కానీ గురువారం స్పెషల్ ఈవెంట్లకు ప్రవాసుల నుంచి మంచి స్పందన వచ్చే ఛాన్స్ ఉంది.
3 బీర్లు 10 డాలర్లు
ఆస్ట్రేలియాలో 'గేట్ వే‘ పేరుతో సిడ్నీలో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 'ఇండియన్ ఎలక్షన్ 2019 కౌంటింగ్‘ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పెద్ద పెద్ద ఎల్ఈడీ తెరలు పెట్టి ఎప్పటికప్పుడు వారికి లైవ్ అప్డేట్స్ అందిస్తారు. ప్రత్యేకంగా ముద్రించిన కార్డులో కేసీఆర్, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఫోటోలను ముద్రించారు. ఇందుకోసం వారి వారి పేర్లను నమోదు చేసుకోవాలని 0406 591 234 అనే నంబర్ కూడా ఇచ్చింది. అంతేకాదు చిన్న సైజు మెను కూడా సిద్ధం చేసింది. ఇందులో 3 బీర్లకు 10 డాలర్లు, వెజ్ బఫెట్కు 15 డాలర్లు, నాన్ వెజ్ బఫెట్కు 18 డాలర్లు చార్జీ చేస్తామని తమ ముద్రించిన కార్డులో పేర్కొంది.
అమెరికాలో ఇలా ..
ఆస్ట్రేలియాలో ఇలా ఉంటే .. అమెరికాలో కూడా జోరుగా ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. 'జడ్జీమెంట్ డే‘ పేరుతో ఈవెంట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ ఎంట్రీ ఫీజు మాత్రం 10 డాలర్లు చెల్లించాలని స్పష్టంచేసింది. దీంతోపాటు నరేంద్ర మోదీకి సంబంధించి 'నమో‘ టీ షర్ట్ తప్పనిసరిగా కొనుగోలు చేయాలని నిబంధన పెట్టింది. ఇందుకోసం మరో 10 డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. అమెరికి కాలమానం ప్రకారం 22వ తేదీ రాత్రి 9.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈవెంట్ల నిర్వహణ ఉంటుందని నిర్వాహకులు స్పష్టంచేశారు. మీరు ఎన్నారైలా? మీ సంబురాలను వన్ ఇండియా పాఠకులతో పంచుకోవాలనుకుంటున్నారా ?. ఈవెంట్లకు సంబంధించి ఫోటోలు వన్ ఇండియా [email protected] మెయిల్ చేయండి. అంతే మీ ఫొటోలను మా వెబ్సైట్లో చూసి ఆనందించండి.