ఎన్నారై హత్యకేసు: ముఖానికి మాస్కులు.. కష్టంగా మారిన గుర్తింపు, హైదరాబాద్లో ముగిసిన అంత్యక్రియలు
హైదరాబాద్: అమెరికాలోని ఓ మాల్లో పనిచేస్తూ ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన కరేంగ్లే కరుణాకర్(53) మృతదేహం స్వదేశానికి చేరుకుంది.
భారత విదేశాంగ శాఖ అధికారులతో చొరవతో కరుణాకర్ మృతదేహం హైదరాబాద్ చేరుకోగా, పంజాగుట్టలోని స్మశానవాటికలో భార్య, కుమారుడు, ఇతర బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన కరుణాకర్ అమెరికా ఒహియో రాష్ట్రంలోని ఫెయిర్ఫీల్డ్లో నివసిస్తున్నాడు. సిన్సినాటిలోని డిక్సీ హైవేలో ఉన్న జిఫ్ఫీ మార్ట్లో పనిచేస్తూ ఈనెల 4న రాత్రి ఇద్దరు దోపిడీ దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఈనెల 8న మరణించిన సంగతి తెలిసిందే.
మృతుడు కరుణాకర్ భార్య విజయ, కుమారుడు అనికేత్ హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్లో నివసిస్తున్నారు. కరుణాకర్ హఠాన్మరణంతో అతడి కుటుంబం దిక్కులేనిదయింది. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తోంది.
మరోవైపు కాల్పులు జరిపి కరుణాకర్ను పొట్టన పెట్టుకున్న దుండగులను సీసీ టీవీ ఫుటేజి ద్వారా గుర్తించే పనిలో ఫెయిర్ఫీల్డ్ పోలీసులు ఉన్నట్లు విజయ సోదరుడు, అనికేత్ మావయ్య అయిన సమరేందర్ కరేంగ్లే తెలియజేశాడు.
ఘటన జరిగిన సమయంలో దుండగులు తమ ముఖాలు కనిపించకుండా మాస్క్లు ధరించి ఉండడంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని, ప్రభుత్వం సానుభూతితో తన అక్కకు ఏదైనా ఉద్యోగం కల్పించాలని, అనికేత్ చదువు బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అతడు విజ్ఞప్తి చేస్తున్నాడు.
మరోవైపు మృతుడు కారుణాకర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆన్లైన్ ఫండ్ రైజింగ్ వెబ్సైట్ అయిన 'గో ఫండ్ మి డాట్కాం' ద్వారా కూడా విరాళాలు సేకరిస్తున్నాడు సమరేందర్. ఇప్పటి వరకు వంద మంది దాతలు స్పందించారని తెలియజేశాడు.