శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా ఉస్మానియా సెంటినరీ వేడుకలు..
కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన ప్రసంగం వీడియోను ప్రదర్శించారు.
శాన్ఫ్రాన్సిస్కో: ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం, నార్త్ అమెరికా బే ఏరియా చాప్టర్ మెంబర్స్ సంయుక్త ఆధ్వర్యంలో శాన్ఫ్రాన్సిస్కోలో ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందల మంది ఉస్మానియా పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.రామచంద్రం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు ప్రొ.సత్యనారాయణ(వీసి తెలుగు యూనివర్సిటీ, మాజీ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్), ప్రొ.వి.సత్తిరెడ్డి(తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్), డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్(సెంట్రల్ హిందీ కమిటీ) సహా తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఉస్మానియా పూర్వ విద్యార్థి, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శాంతను నారాయణ్ వర్సిటీలో తన అనుభవాలను పంచుకున్నారు. తన జీవితాన్ని ఉస్మానియా ప్రభావితం చేసిన తీరును, తన దృక్పథాన్ని మార్చివేసిన తీరు గురించి వివరించారు. ఉస్మానియా తన సామర్థ్యాన్ని పెంచిందని, విశాల దృక్పథంతో ఆలోచించడం నేర్పిందని తెలియజేశారు.
కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చిన ప్రసంగం వీడియోను ప్రదర్శించారు. దీంతో పాటు ఓయు ఘన చరిత్ర గురించి, దాని వ్యవస్థాపకులైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి వీడియోలో గొప్పగా వివరించారు. మరో ఓయూ పూర్వ విద్యార్థి, కేవియం నెట్ వర్క్ వ్యవస్థాపకులు సయ్యద్ బషరత్ తన వర్సిటీ అనుభవాలను ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.
ఓయూ వీసి ప్రొ.రామచంద్రం తన స్పూర్తిదాయక ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఓయూ గురించి మరింత గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లాలని, ఇందుకోసం తమ తమ రంగాల్లో అద్భుత కృషి చేయడం ద్వారా వర్సిటీకి మరింత పేరు తీసుకురావాలని పూర్వ విద్యార్థులకు సూచించారు. అనంతరం ప్రొ.సత్యనారాయణ సహా పలువురు ప్రొఫెసర్లు, పూర్వ విద్యార్థులు తమ తమ అనుభవాలను పంచుకున్నారు.
కార్యక్రమం సజావుగా సాగడం కోసం విజయ్ చువ్వా, జి.మహమ్మద్ ఇక్బాల్, ధనుంజయ్ బోడా, భాస్కర్ మడ్డి, శ్రీనివాస్ గుజ్జు, రఫియా సయ్యద్, నదీమ్, రమేష్ కొండా, సాగర్, తదితరులు వలంటీర్లుగా సేవలందించారు.