అమరావతినే రాజధానిగా కొనసాగించండి: ప్రధాని మోడీకి కువైట్ తెలుగు సంఘాల ఐక్యవేదిక వినతి
కువైట్లో ఉన్న 50కి పైగ తెలుగు సంఘాల కూటమి "తెలుగు సంఘాల ఐక్య వేదిక" కన్వీనర్ సుధాకర రావు భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతిని కాపాడండి అంటూ ఓ లేఖను రాసారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండాపోయింది.
ఆ తరుణంలో అప్పటి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం 33 వేల ఎకరాలను రైతుల దగ్గరనుండి సేకరించగా, అక్టోబరు 2015లో నరేంద్ర మోడీ చేతులమీదుగా అమరావతి నగర నిర్మాణానికి శంఖుస్తాపన జరిగింది. గత నాలుగు సంవత్సరాలలో ఎనిమిది వేల కోట్లకుపైగా ఖర్చుపెట్టి రోడ్లు భవనాలను నిర్మించటం జరిగింది.
అటు తరువాత ఏప్రిల్ 2019లో జరిగిన అసంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం రాజాధాని మీద వివిధ కమిటీలను నియమించి, వారి సలహా సూచనల మేరకు రాజధానిని అధికార వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్టణంకు తరలించాటనికి అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి తగిన ఏర్పాట్లను చేస్తుంది.
మీ చేతులమీదుగా శంఖుస్తాపన జరిగిన అమారావతిని ప్రపంచ ప్రఖ్యాత పట్టణాలైన న్యూయార్క్, లండన్, సింగపూర్, పారిస్లకు పోటీగా నిర్మిచవలసింది పోయి కనుమరుగయ్యే పరిస్తితి కనిపిస్తున్నదని లేఖలో ప్రధానికి తెలిపారు. ఇలాంటి తరుణంలో మీరు, కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని అమరావతిని కాపాడవలసిందిగా తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్ తరుపున విజ్ఞప్తి చేశారు.