ఒడిదొడుకులు ఎదురైనా అనుకున్నది సాధించాం.. తానా ముగింపు సభలో సతీశ్ వేమన..
వాషింగ్టన్ డీసీ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం..తానా 22వ మహాసభలు వాషింగ్టన్ డీసీలో ఘనంగా ముగిశాయి. అధ్యక్షుడు సతీష్ వేమన సారధ్యంలో జరిగిన ఈ మహాసభలు తానా చరిత్రలో మరో రికార్డును సృష్టించింది. ఈ సారి మహాసభలకు దాదాపు 20వేల నుంచి 25వేల మంది హాజరయ్యారు. ఇంతమంది అమెరికాలో జరిగిన ఓ తెలుగు మహాసభలకు రావడం ఇదే మొదటిసారి.
తానా ముగింపు సమావేశంలో అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన సతీష్ వేమన తన హయాంలో జరిగిన వివిధ ఘటనల్ని గుర్తుచేసుకున్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ తానా లక్ష్యాలు, ఆశయసాధనలో విజయం సాధించడం గర్వంగా ఉందని అన్నారు. తానా టీమ్ స్క్వేర్ ద్వారా దాదాపు 200 డెత్బాడీలను స్వస్థలాలకు పంపించామని చెప్పారు. ఫుడ్డ్రైవ్, బ్యాక్ప్యాక్ ద్వారా నిరుపేద పిల్లలకు స్కూల్ బ్యాగ్ల పంపిణీ, వైద్యచికిత్సలు, హ్యూస్టన్ నగరంలో వచ్చిన హురికేన్తో నష్టపోయిన బాధితులను తానా తరపున ఆదుకున్న విషయాన్ని సతీశ్ వేమన గుర్తు చేశారు.
తానా తరఫున తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను చేశామని, ఎన్నో సంస్థలకు చేయూతను ఇచ్చినట్లు సతీశ్ చెప్పారు. వైజాగ్ తుపాన్ బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంతో పాటు ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటుకు కృషి చేశామని చెప్పారు. కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళలో 60 లక్షల రూపాయల నిధులతో స్త్రీ శక్తి భవన్ను నిర్మించామని చెప్పారు. ఇలాంటి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను చేపట్టేందుకు సహకరించిన మిత్రులు, తానా సభ్యులకు సతీశ్ వేమన ధన్యవాదాలు తెలిపారు.
తానా సేవలు నిరంతరాయంగా కొనసాగాలని కోరుకుంటున్నానని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని సతీశ్ వేమన చెప్పారు. పదవిలో ఉన్నా లేకపోయినా తెలుగువాళ్ళకు సేవలందించేందుకు ఎల్లవేళలా ముందుంటానని హామీ ఇచ్చారు.