సిక్కుపై దాడి: దోషికి జైలు శిక్ష
బాధితుడైన భారత దేశానికి చెందిన సిక్కు టాక్సీ డ్రైవర్కు నష్ట పరిహారం చెల్లించాలని నిందితుడ్ని కోర్టు ఆదేశించింది. తన తీర్పు ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఓ గుణపాఠం కావాలని, ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఉపేక్షించేవి కావని న్యాయమూర్తి కాఫ్నర్ తన తీర్పులో పేర్కొన్నారు. నిందితుడు లార్సన్ అత్యంత అసభ్యకరమైన భాషతో దూషించాడని, జాత్యాహంకార పూరితంగా వ్యవహరించి దాడికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు.
కాగా నిందితుడు లార్సన్పై హేట్ క్రైం నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కోర్టుకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2012 అక్టోబర్లో తాగిన మత్తులో ఉన్న లార్సన్ను తన టాక్సీలో తీసుకువెళ్లి సీటెల్ సమీపంలోని అతని నివాసం వద్ద దిగబెట్టాడు సిక్కు డ్రైవర్. టాక్సీ దిగిన తర్వాత లార్సన్ సిక్కు డ్రైవర్ గడ్డం పట్టుకుని అటు ఇటు తిప్పుతూ.. పలుమార్లు కిందపడేసి అసభ్యకరంగా దూషించాడు.
సిక్కు వ్యక్తిపై పలుమార్లు దాడి చేసిన లార్సన్, అతని వేషాధారణపై తీవ్ర పదాజాలంతో దూషించాడు. అంతేగాక ఇక్కడ ఏం చేస్తున్నావని, తమ దేశానికి ఎందుకు వచ్చావని అంటూ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి 911 నెంబరుకు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు లార్సన్ను అరెస్ట్ చేశారు. బాధిత సిక్కు వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితునికి ముఖంపై, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. వారం రోజులు చికిత్స తీసుకున్న అనంతరం బాధితుడు కోలుకున్నట్లు పోలీసులు తెలిపారు.