వైభవంగా సిలికానాంధ్ర మనబడి సాంస్కృతిక ఉత్సవం (ఫోటో)
మిచిగాన్: మిచిగాన్లో ఈ సంవత్సరం రెండు ప్రాంతాలలో సాంస్కృతికోత్సవం జరపాలని నిర్ణయించారు. మొదటి సాంస్కృతికోత్సవం నొవై హై స్కూల్ లో మార్చ్ 29 న జరిగింది. ఈ సాంస్కృతికోత్సవంలో అన్నే ఆర్బర్, కాన్టన్, గ్రాండ్ ర్యాపిడ్, లావెన్సింగ్, లివోనియా, నోవి మనబడి కేంద్రాల పిల్లలు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు పాల్గొన్నారు .
రెండవ సాంస్కృతికోత్సవం ట్రాయ్ ప్రాంతంలో మే 30 న జరుగుతుంది. మనబడి ప్రకారం సాంస్కృతికోత్సవం శోభాయాత్ర, వేద ప్రవచనాలతో శోభాయమానంగా మొదలైంది. గణేశ పంచరత్నం, జయ జయ ప్రియ భారతి పాట, కూచిపూడి నృత్యం, తెలుగు తేజాలు, ఉగాది నాటిక, వేమన సుమతి శతకాలు, రామదాసు కీర్తనలతో ప్రేక్షకులకు కనులవిందు చేసారు.
బాల బడి చిన్నారులు వారు మనబడి లో నేర్చుకున్న తెలుగు పాటలు పద్యాలూ ఎంతో ఆత్మ విశ్వాసం తో పాడి అందరి అభిమానాలను చూరగొన్నారు. తెలుగు తేజాలు, ఉగాది నాటిక, శ్రావణ భాద్రపదాలు, విక్రం బేతాళ నాటికలు, జొన్నవిత్తుల వారు మన జిల్లాల పై రాసిన పాటకు మనబడి విద్యార్థుల నృత్యం అందరిని అక్కట్టుకుంది.
మనబడి కేంద్రాల సమన్వయ కర్తలు, గురువులు మరియు తల్లి తండ్రులు, వారు తీర్చిదిద్దిన తెలుగు భాషా జ్యోతులు( విద్యార్థులు) రంగస్థలం పై ప్రదర్శించిన ప్రతిభ పాటవాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ విద్యార్థులు మన తెలుగు భాషా జ్యోతిని గర్వంగా భావి తరాలకు ప్రజ్వలింప చేస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా సిలికానాంధ్ర మనబడి అభివృద్ధి విభాగం నాయకులు శరత్ వేట హాజరయ్యారు. ఇక శరత్ వేట పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నిర్వహించిన తెలుగు భాషా పరిక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసారు.
ఆయన మాట్లాడుతూ మనబడి బృందం అమెరికా దేశ వ్యాప్తంగా 40 స్కూల్ జిల్లాలలో తెలుగు భాషకు, ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు కోసం కృషి చేస్తోందని తెలియజేసారు. మనబడి సమన్వయకర్తలు, గురువులు, స్వచ్చంద సేవకులు, తల్లి తండ్రులు సహకారంతో మనబడి సాంస్కృతికోత్సవం కనులపండువగా జరిగింది.