మనసున్న తెలుగు వారు: కరోనావేళ విద్యార్థులకు అండగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ సంస్థ
ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. యూకేలో ఈ మహమ్మారి తీవ్రత అధికంగా ఉంది. అయితే లండన్ నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అక్కడ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) సహాయక చర్యలు చేసింది. అక్కడ కరోనా వైరస్ కారణంగా ఇబ్బంది పడుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు నిత్యావసర వస్తువులను లండన్లోని ఈస్ట్ హోమ్లో గురువారం రోజున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాల్ ప్రతినిధులు రవి మోచర్ల, సత్యేంద్ర పగడాల పాల్గొన్నారు. వీరి ఆధ్వర్యంలో తాల్ కార్యకర్తలు వివిద దేశాలకు చెందిన సుమారు 400 విద్యార్థులకు సహాయం అందించారు.
ఇక శరవనాభవన్ గ్రూప్ యజమాని శివకుమార్, శరవనాభవన్ (యూకే) యజమాని రేఖ విక్కి లండన్ శక్తి స్టోర్స్ యజమాని పీఆర్ సురేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయం చేశారు. తమకు ఈ విపత్కర సమయంలో అండగా ఉండి సహాయం చేసినందుకు విద్యార్థులు తాల్కు కృతజ్ఞతలు తెలిపారు.
తాల్ ఛైర్మెన్ సోమిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ సాంఘీక సహాయం అందించడానికి తాల్ ఎప్పుడూ ముందుంటుందని కేవలం తెలుగు విద్యార్థులకే కాకుండా అంతర్జాతీయ విద్యార్థులకు కూడా తోడ్పాటు అందించామన్నారు.
లండన్లోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సహాయకార్యక్రమాలను విస్తరిస్తామని సోమిశెట్టి శ్రీధర్ చెప్పారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్క దాతకు రవి మోచర్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇక తెలుగు అసోసియేషన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. యూకేలో తొలి తెలుగు చారిటీ సంస్థ.
2005 ఏప్రిల్లో తాల్ను ప్రారంభించడం జరిగింది. తెలుగు సంస్కృతిని పంచుతూ పరిరక్షించేందుకే తాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తాల్ నేతృత్వంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తాల్ తెలిపింది. ఇక పలు పండగలను కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తునట్లు తాల్ సభ్యులు చెప్పారు.