అనుబంధం గొప్పది: బాపు మృతికి తానా సంతాపం
హైదరాబాద్: ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బాపు మృతికి తానా సంతాపం ప్రకటించింది. ఈ మేరకు తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు డాక్టర్ చౌదరి జంపాల ఓ ప్రకటన విడుదల చేశారు. వారి ప్రకటన ఇలా సాగింది. సంతకం అక్కర్లేని చిత్రకారుడు, టైటిల్ కార్డు అక్కర్లేని చలనచిత్ర దర్శకుడు, తెలుగు అక్షరాన్ని, తెలుగు పుస్తకాన్ని, తెలుగు సంస్కృతిని నిరతరసాధ్యంగా సుసంపన్నం చేసిన మహా కళాకారుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు, తెలుగు జాతి గర్వించదగ్గ మహామనీషి, మన బాపు మనల్ని ఈరోజు విషాదంలో వదిలేసి స్వర్గంలో ఉన్న తన ప్రాణమిత్రుణ్ణి, జీవితభాగస్వామిని కలవడానికి వెళ్ళిపోయారని తెలుపటానికి చింతిస్తున్నాం.
డబ్భై సంవత్సరాలుగా తెలుగు సంస్కృతిని దృశ్యపరంగా సుస్థిరం చేసిన బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) 1933 డిసెంబరు 15న నర్సాపురంలో మాతామహుల ఇంట జన్మించారు. స్వస్థలం కంతేరు కాని మద్రాసులో పెరిగారు. తండ్రిగారి కోరిక మేరకు లా చదివినా, చిత్రకారునిగానే ఆయన జీవితం కొనసాగించారు. ప్రియమిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణతో కలసి పత్రికారంగంలో సంచలనం సృష్టించారు.
అడ్వర్టైజింగ్ రంగంలో ఉన్నత పదవులు నిర్వహించినా, పత్రికారంగంపై మోజుతో జ్యోతి మాసపత్రికను స్థాపించారు. 1967లో దర్శకత్వం వహించిన తొలిచిత్రం సాక్షితోనే ఉత్తమశ్రేణి దర్శకుడిగా గురింపు పొందారు. ముత్యాలముగ్గు, సీతాకల్యాణం వంటి చిత్రాలతో అంతర్జాతీయ ప్రఖ్యాతి గడించారు. రెండు జాతీయ అవార్డులు, రెండు నంది అవార్డులు ఆయనను వరించాయి. తాష్కెంట్, లండన్, చికాగో వంటి అంతరజాతీయ చలనచిత్రోత్సవాలలో ఆయన చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ఆయన చేతివ్రాత కంప్యూటర్ ఫాంట్గా స్థిరపడింది. బాపు బొమ్మ అందమైన ఆడపిల్లకు పర్యాయపదంగా మిగిలింది. చిత్రకారుడిగానే కాక వ్యంగ్య చిత్రకారుడిగాకూడా ఆయన ప్రసిద్ధులు.
తానా తొలిరోజులనుండి, బాపుకు తానాతో ప్రగాఢ అనుబంధం ఉంది. 1985లో లాస్ ఏంజెల్స్లో జరిగిన తానా మహాసభలలో ముఖ్య అతిథిగా తానా ఆయనను గౌరవించింది. బాపు బొమ్మ, రమణ రచనల మొదటి ప్రచురణల స్వర్ణోత్సవాన్ని 1995లో దశమ తానా మహాసభలలో (చికాగో) తానా ఘనంగా నిర్వహించటం తెలుగుదేశంళో అందరికీ స్ఫూర్తి కలిగించింది. ఆ స్వర్ణోత్సవాల్లో భాగంగా బాపు-రమణలపై తానా ప్రత్యేకంగా ప్రచురించిన, బొమ్మా-బొరుసు అనే పుస్తకం బహుళ ప్రచారం పొందింది. తానా పత్రికకు ప్రత్యేకంగా శ్రీ బాపు రామాయణం, కృష్ణలీలల బొమ్మల సీరియల్స్ అందించారు.
బాపు నిర్యాణం మిగిల్చిన లోటు పూర్చలేనిది. కాని తెలుగువారి మనసుల్లో, తెలుగు సాంస్కృతిక ప్రపంచంలో ఆయన స్థానం శాశ్వతమైనది. బాపు కుటుంబసభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి అభిమానులకు తానా తరపున ప్రగాఢ సంతాపం తెలీయ్జేస్తున్నాం. శ్రీ బాపు ఆత్మకు శాంతి లభించాలని కోరుకుంటున్నాం.