టాంటెక్స్ 104: నిత్య జీవితం నుండి పుట్టిన కథలు
డల్లాస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం, మార్చి 20వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 104 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ తెలుగుసాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం.
డాలస్లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు. ముందుగా దొడ్ల రమణ గారి పోతన భాగవతం లోని ప్రార్థన శ్లోకాలతో కార్యక్రమం మొదలైనది. అటు తరువాత అందెశ్రీ, గోరేటి వెంకన్న, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి జనపదాలను వేముల లెనిన్ గారు గొప్పగా పాడి విన్పించారు.
గ్రామాలలోని రోజువారీ జీవనానికి ఈ పాటలు చాల దగ్గరగా వున్నాయి. డాక్టర్ అందెశ్రీ రచించిన "నది నడిచి పోతున్నది" అన్న కవిత ను సభలో ఉదహరించి అలాగే నదులపై కవి వర్యులు అందెశ్రీ చేస్తున్న మహా యజ్ఞాన్ని సభికులకు పరిచయం చేయడం జరిగింది.
అలాగే సెలయేళ్ళను, నదీ తీరాలను కడు మనోహరము గా వర్ణించిన సాటి లేని మేటి మహాకవి దేవులపల్లి విరచిత కృష్ణ పక్షము లోని "అన్వేషణము" ఖండికను ఎంతో చక్కగా పాడారు. సుప్రసిద్ధ ప్రజా వాగ్గేయ కారులు అయినటువంటి గోరేటి వెంకన్న విరచిత "వాగు యెండి పాయెరో" అన్న గీతాలాపన సభికుల హృదయాలను గాఢంగా స్పృశించింది.
104 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహితీ సభలో పుస్తక పరిచయములో భాగంగా జానపద విజ్ఞానం అను పుస్తకమును డాక్టర్ కలవగుంట సుధ గారు చక్కగా సభకి తెలియపరిచారు. వివిధభాషలలోని జానపదాలు ఇందులో వున్నాయని, జానపదాలు ఒకప్రాంతములో పుట్టి ఇంకో ప్రాంతంలో కూడా వాడుకలోకి వస్తాయి అని వివరించారు.
అంతే కాకుండా వివిధ ప్రాంతాల తెలుగు వారి యాసను అనుకరిస్తూ చేసిన ప్రసంగం ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. జానపదాలు అంటే జనులు విరివిగా వాడే పదాలు అని వివరించారు. "అమెరికా నుండి అనకాపల్లి వరకు జానపదాల్లో అమ్మ పాట వుంటుంది" అని పాడి వివరించారు.
"ప్రళయకావేరి పుస్తకములో మొత్తం 21 కథలు వున్నాయి. ప్రళయకావేరి అసలు పేరు పులికాట్ సరస్సు. ప్రళయకావేరి, అందులో తాత గారి దీవయిన జల్లల దొరువు, దాని చుట్టూ ఉండే ఇతర దీవులు, అడవులు, అక్కడి ప్రజలు, పిట్టలు... వీటి చుట్టూనే అన్ని కథలు నడుస్తాయి. పల్లెల్లో వేసుకునే పొడుపు కథలు, నాటకాలు, సావాసగాళ్లు, అల్లరి ఆటలు, చిలిపి పనులు, భయాలు, అలకలు, ఉప్పు కయ్యలు, వలస పిట్టలు...ఇవే కథా వస్తువులు. శైలి, శిల్పం, కథనం, పాత్ర చిత్రణ వీటి గురించే, దేనికదే ఓ ప్రత్యేకం" అని బసాబత్తిన శ్రీనివాసులు గారు వివరించారు.
అయన వివరణ వెంటనే సభికులందరికీ "ఈ ప్రళయ కావేరీ కథలు తప్పక చదవాలి" అనిపించింది. అంతే గాకుండా వివరణ మద్యలో వక్త కథల్లోని యాసలో ప్రసంగించి ప్రేక్షకులను అకట్టుకున్నారు. ప్రళయకావేరి కథలోని సన్నివేశాలు, ప్రదేశాలు ప్రేక్షక మహాశయుల కనులముందు వుంచారు.
104వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శంకగిరి నారాయణస్వామిగారు "నిత్య జీవితంలోంచి కథలెలా పుడతాయి?" అనే అంశం మీద ప్రసంగిస్తూ కొన్ని ప్రవాస కథలు విండో షాపింగ్, ఎంతెంత దూరం, కారు పున్నమిలను ఉదాహరణలుగా తీసుకుని చక్కగా విశ్లేషించారు.
నిత్య జీవితం నుండి పుట్టిన కథలు
నెల నెలా తెలుగు వెన్నెల చరిత్రలో మొదటి సారి ముఖ్య అతిథి అంతర్జాలం నుండి ప్రసంగించడం ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. "కథ కాల్పనిక సాహిత్య రూపమే అయినా, సమకాలీన తెలుగు కథ నిజ జీవిత చిత్రణకి పెద్ద పీట వేస్తున్నది అనేది కాదనలేని సత్యం. అయితే, నిజ జీవిత సంఘటనలు యథాతథంగా రాసేస్తే అది కథవుతుందా? అలాంటప్పుడు వార్తాపత్రిక కథనానికి, కథకూ తేడా ఏముంది.
నిత్య జీవితం నుండి పుట్టిన కథలు
నిజ జీవిత సంఘటనల నుండి ఒక మంచి కథని పుట్టించాలంటే రచయితకి ఎటువంటి సాధనాలు అందుబాటులో ఉన్నాయి" వంటి విషయాలు కొన్నిటిని మన అమెరికా తెలుగు రచయితలు గత సంవత్సర కాలంలో రాసిన కొన్ని కథలలో స్పష్టంగా వివరించారని తెలిపారు.
నిత్య జీవితం నుండి పుట్టిన కథలు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, టి ఎన్ ఎల్ వారికి కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.
నిత్య జీవితం నుండి పుట్టిన కథలు
ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, తక్షణ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు మండిగ శ్రీ లక్ష్మి, సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, అట్లూరి స్వర్ణ, మార్తినేని మమత, మాడ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.