ఏటీఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
సిడ్నీ: ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం(ఏటీఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనురాగ్ శర్మ, తెలంగాణ రాష్ట్ర హోంశాఖా సలహాదారు టి ప్రకాశ్ గౌడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేంద్రనగర్, జూలీ ఓవెన్స్ - ఎంపీ పారామాటా, జూలియా ఫిన్, స్కాట్ ఫార్లో హఫ్ మెక్డెర్మట్, డేవిడ్ క్లార్క్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
తొలుత తెలంగాణ అమరులకు, జయశంకర్ సార్కు నివాళి అర్పించి తెలంగాణ ఆటా, పాటలతో సభా ప్రాంగణం హోరెత్తింది. వేడుకలు జరుగుతున్న ప్రాంతమంతా 'జై తెలంగాణ' నినాదాలతో మారుమోగిపోయింది.
అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. విదేశాలలో ఉంటూ మాతృభూమి గురించి ఆలోచిస్తూ, తెలంగాణ అస్తిత్వాలను కాపాడుతూ.. ఎన్నారైలు పోషిస్తున్న పాత్ర ఎనలేనిదన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఈ దృష్ట్యా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ తోటి సభ్యులను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందని, రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు, కొత్తగా 500 పరిశ్రమలకు భూకేటాయింపులు చేశామని ప్రకటించారు.
తొలిదశలో 8,200 ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. కాకతీయ ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్ టైల్ పార్కు, సిరిసిల్ల అప్పారెల్ పార్కు తో పాటు నిజామాబాద్, గద్వాల, ఖమ్మం, సంగారెడ్డిలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని, ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు.
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. అమరుల బలిదానాలను స్మరించుకొని తెలంగాణను అగ్రగామిగా మార్చుకోవాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, ఉద్యమ సమయంలో తన అనుభవాలను స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వివిధ పథకాలను వివరించారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్ఆర్ఐల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచడం చారిత్రక అవసరం అన్నారు. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని, తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్నారు.
దేశ, విదేశాల పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేవు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ఇతరులకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలిచారని, బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి. తాగడానికి నీరు, వ్యవసాయానికి సాగునీరు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధపెట్టారని, రైతు తమ పంటలకు ఎరువులు వేసుకొనేందుకు రెండు పంటలకు ఎకరానికి రూ.8 వేలు చొప్పున రైతు ఖాతాలో నగదు జమ వేసే పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు.
ఏటీఫ్ అధ్యక్షుడు అశోక్ మాలిష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంతోనే మన కర్తవ్యం పూర్తయినట్లు కాదని, బంగారు తెలంగాణ నిర్మాణంలో మనమందరం బాధ్యత వహించాలని కోరారు. ఏటీఫ్ ఆశయాలను సభకు వివరించారు. ఏటీఫ్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సేరి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఆస్ట్రేలియాలోని నలుమూలల నుంచి తెలంగాణవాసులు, ప్రవాస భారతీయులు, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో సునీల్ కల్లూరి, మిథున్ లోక, వినయ్ యమా, ప్రదీప్ తెడ్ల, గోవెర్దన్ రెడ్డి, అనిల్ మునగాల, సందీప్ మునగాల, కిశోరె రెడ్డి, నటరాజ్ వాసం, శశి మానేం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, పాపి రెడ్డి, నర్సింహా రెడ్డి, ప్రమోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం ఆస్ట్రేలియా అధ్యక్షులు అశోక్ మరం, సందీప్ మునగాల పాల్గొన్నారు.