అమెరికాలో సిద్ధిపేట టెక్కీ అనుమానాస్పద మృతి
సిద్ధిపేట: తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ టెక్కీని 28 ఏళ్ల కృష్ణ చైతన్యగా గుర్తించారు. సిద్ధిపేటలోని మారుతి నగర్ కాలనీకి చెందిన వెంకన్నగారి శ్రీనివాసులు, రాణి దంపతుల చిన్న కుమారుడు అతను.
కృష్ణ చైతన్య నాలుగేళ్ల క్రితం కాగ్నిజెంట్ సంస్థలో ఆన్సైట్ ఉద్యోగిగా అమెరికా వెళ్లాడు. ఇటీవలే అతను డల్లాస్లోని సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో చేరాడు. ఓ పెయింగ్ గెస్ట్హౌస్లో నివాసం ఉంటున్నాడు.
ఈ నెల 26వ తేదీన అతను తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. తనకు తలనొప్పిగా ఉందని, ఉదయం మాట్లాడుతానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ నెల 27వ తేదీన అతను గది తలుపులు తెరవలేదు. దీంతో గెస్ట్హౌస్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
తలుపులు తెరిచి లోనికి వెళ్లిన పోలీసులకు కృష్ణచైతన్య శవం కనిపించింది. కృష్ణ చైతన్య బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అతని మరణానికి వ్యాధి కారణమా, మరేమైనానా అనేది తేలాల్సి ఉంది.
కృష్ణ చైతన్య మృతదేహాన్ని భారత్కు తెప్పించడానికి మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఈ విషయంపై ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకు, భారత విదేశాంగ కార్యదర్శికి లేఖలు రాశారు. గురువారానికి మృతదేహం భారత్ చేరుకునే అవకాశం ఉంది.